Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , ఆయన మేనల్లుడు హరీశ్ రావు గురించి రకరకాలుగా గత కొద్ది సంవత్సరాలుగా ఆసక్తికర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో హరీశ్ రావుకు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గిస్తున్నారనేది అందులో ముఖ్యమైనది.
అయితే, తాజాగా కీలకమైన ఎన్నికల్లో హరీశ్ రావును మళ్లీ తెరమీదకు తెచ్చారు. మార్చి 14వ తేదీన తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు.
మంత్రులతో కీలక సమావేశం
హైదరాబాద్లోని ప్రగతిభవన్లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు, వ్యూహాలపై చర్చించారు. వ్యూహాత్మకంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణి దేవిని బరిలోకి దింపిన కేసీఆర్.. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని నియోజకవర్గం కావడంతో… ఉమ్మడి జిల్లాకో మంత్రి చొప్పున.. ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన రంగారెడ్డి జిల్లా బాధ్యతలు మంత్రి హరీష్ రావుకు అప్పగించిన కేసీఆర్.. మహబూబ్ నగర్ జిల్లా బాధ్యతలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి.. హైదరాబాద్ బాధ్యతలు మంత్రి గంగుల కమలాకర్కు అప్పగించారు.
రంగారెడ్డి బాధ్యతలే ఎందుకు ?
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలకమైనది. విద్యావంతులు, ఉద్యోగులు, పట్టభద్రులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో దక్కే ఓట్లే విజేతను నిర్దేశిస్తాయనుకోవచ్చు. అలాంటి కీలకమైన ఉమ్మడి జిల్లా కాబట్టే సమర్థుడైన నేతగా పేరున్న హరీశ్ రావుకు ఈ బాధ్యతలు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారని అంటున్నారు.