టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేక రాష్ట్రం అజెండాతో పార్టీ స్థాపించి ఆకాంక్ష నెరవేర్చుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠం సైతం దక్కించుకున్నారు.
అదే ఒరవడిలో ఇప్పుడు తన వారసుల విషయంలోనూ ఆయన కల నెరవేరనుంది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ప్రజాప్రతినిధిగా రీఎంట్రీకి అధికారిక ప్రకటనకు మరికొన్ని గంటలే సమయం ఉంది.
రీ ఎంట్రీ సమయంలోనే….
నిజామాబాద్ ఎంపీగా గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ఆమె తిరిగి ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరటంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ ఎన్నికకు సంబంధించి శుక్రవారం పోలింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా సుభాష్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతన్కర్ లక్ష్మీనారాయణ, బరిలో ఉన్నారు.
ఆయన మృతితో….
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా.. 823 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ నామినేషన్ అయిన తర్వాత బోధన్ మున్సిపాలిటీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ గుణ శేఖర్ మృతిచెందాడు.. దీంతో.. 823 ప్రజాప్రతినిధులే ఉన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ఓట్లు కూడా కవిత ఖాతాలోనే
టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 80 శాతం ఓట్లు పడినట్టు ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.. అంతేకాదు.. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం సాగుతోంది.. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్లో ప్రజాప్రతినిధులతో పాటు.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో కవిత గెలుపు సునాయాసమే.
తెలంగాణలో షాక్ ఎవరికంటే,
టీఆర్ఎస్కు దాదాపు 90శాతం ఓట్లు పడ్డ ఆశ్చర్యపోనవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 598 మంది ప్రజాప్రతినిధుల బలం ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కొద్దిమంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేరారు. మరికొందరు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో ఆ రెండు పార్టీలు టీఆర్ఎస్కు పోటీ ఇవ్వడం జరిగే పని కాదని అంటున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కోటాలో కవిత గెలుపు లాంచనప్రాయమేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరనుందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలకు షాక్ ఖాయమని అంచనా వేస్తున్నారు.