బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలలో మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కాగా.. రెండవ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అంతే ఇక మళ్ళీ టాలీవుడ్ సినిమాలలో కనిపించలేదు. అంత సమయమూ కియారా కి దొరకడం లేదు. వరసగా హిందీ సినిమాలలో నటిస్తూ పూర్తిగా బాలీవుడ్కు పరిమితం అయిపోయింది కియారా.
ఇకపోతే ‘ఫగ్లీ’ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ, ఆ సినిమా తర్వాత భారత మాజీ క్రికెటర్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథతో తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్టోల్డ్ కహాని’ సినిమాతో ఫాంలోకి వచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోవడమే కాదు.. అక్షయ్ కుమార్ తో, గుడ్ న్యూజ్ చిత్రంలో నటించి బంపర్ హిట్ అందుకుంది.
దీంతో బాలీవుడ్ మేకర్స్ కి కియారా లక్కీ హీరోయిన్ గా కనిపించింది. అందుకే అందరు తమ సినిమాలలో ముందు కియారా నే అనుకుంటున్నారు. ఇక 2020 వ సంవత్సరంలో కియార తీరిక లేకుండా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కరోనా అందరి ఆశల మీద నీళ్లు చల్లింది. ఇలాంటి పరిస్దితుల్లో కియారా నటించిన తాజా చిత్రం ఇందూ కి జవానీ ఓటీటీలో రిలీజవుతోందనే వార్త అభిమానులకు ఊరట కలిగించింది.
అంతే కాకుండా ఈ సినిమా గురించి కియరా ఓ ఫన్నీ వీడియోను అభిమానులకు షేర్ చేసింది. ఇందూ కి జవానీ చిత్రంలో తన పాత్ర ఇందూ గుప్తా అని, ఆ ఇందూ కోసం అభిమానుల్లారా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారా.. అయితే డేటింగ్ తేదీ ఫిక్స్ చేసేద్దామా.. అంటూ కియరా ట్విస్ట్ ఇచ్చి, స్క్రీన్ పైనే సెప్టెంబర్ 16 వ తేదీ అంటూ న్యూస్ చదివేసింది. ఇక డేటింగ్ నేపథ్యంలో నిర్మిస్తున్న ఇందూ కి జవానీ చిత్రానికి అబీర్ సేన్ దర్శకత్వం వహించాడు.