తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీ తీసుకురాబోతున్నాట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా కొత్త ఐటీ పాలసీ ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే కొత్త పాలసీ ప్రజలు మరిన్ని ప్రభుత్వ సేవలు అందుకునే విధంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ విభాగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.
పౌరుల సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా మరిన్ని ఆన్లైన్ మొబైల్ ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు రాబట్టినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ పాలసీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో నూతన టెక్నాలజీ తీసుకురానున్నట్లు ఐటీ శాఖ విభాగాధిపతులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా సమీప భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టీ ఫైబర్ కార్యక్రమం ద్వారా అందించాల్సిన కార్యక్రమాల పైన ఇప్పటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.