AP Aided Schools: ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను ప్రభుత్వం కాజేయాలని కుట్ర చేస్తున్నదనీ, అందుకే రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద జీవో తీసుకువచ్చిందని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ గ్రాంట్ తో నడుస్తున్న విద్యాసంస్థలు రెండు వేలకు పైగా ఉన్నాయని పేర్కొన్న మంత్రి సురేష్ .. ఎయిడెడ్ విద్యాసంస్థల ద్వారా మెరుగైన ఫలితాలు రావడం లేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమనీ, ఈ క్రమంలో నిరర్ధకంగా పని చేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.
ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పలు సిఫార్సులు చేసిందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను ప్రభుత్వమే తీసుకోవాలన్నది ఈ కమిటీ సిఫార్సుల్లో ఒకటని, కమిటీ చేసిన సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేష్ అన్నారు.
కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ఎయిడెడ్ విద్యాసంస్థల ముందు మూడు ప్రతిపాదనలు ఉంచామని తెలిపారు. అందులో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ గ్రాంట్ ను పూర్తిగా వదులుకోవడం, విద్యాసంస్థలను మొత్తంగా ప్రభుత్వానికి అప్పగించడం, పూర్తిగా ప్రైవేటుగా విద్యాసంస్థను నడిపించడం వంటి ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఎయిడెడ్ విద్యాసంస్థలు ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఇదే క్రమంలో అన్ ఎయిడెడ్ పాఠశాలలు మూతపడవని ఒక వేళ యాజమాన్యాలు మూసివేయాలని నిర్ణయించుకుంటే వాటిని ప్రభుత్వమే నడుపుతుందని వెల్లడించారు మంత్రి సురేష్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యాసంస్థలు మూతపడవని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏపి ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. ఈ సంస్కరణలు తీసుకువచ్చింది విద్యాసంస్థల ఆస్తులను కొట్టేసేందుకు కాదని మంత్రి స్పష్టం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కళాశాలల్లో అధ్యాపకులకు సాధారణ రీతిలోనే బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.