విశాఖ: ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆదానీ గ్రూపు సిద్ధంగానే ఉందనీ, త్వరలోనే ఒక ప్రకటన చేస్తుందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విశాఖలో బీమ్స్ టెక్ అంతర్జాతీయ సదస్సుకు హజరయ్యారు. ఆదానీ గ్రూపు ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేదని, ఇక్కడ నుండి తరలివెళుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేకపాటి దీనిపై వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు భూములు లేకుండా ఉన్నాయని మేకపాటి అన్నారు.
పరిశ్రమలకు ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నారో పూర్తి సమగ్ర నివేదిక అడుగుతున్నామనీ, అందుకు తగిన విధంగా ప్రభుత్వం నుండి భూకేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో బంగాళాఖాతం సముద్ర పరిధిలో ఉన్న ఏడు దేశాలు పాల్గొని పోర్టులలో ఎగుమతులు, దిగుమతులు, అభివృద్ధిపై చర్చించారు.