అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో ఏం వెలగబెట్టారని హఠాత్తుగా రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు? అని ప్రశ్నించారు.
అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలి… అది కూడా విద్యార్థులకు ఇష్టమైతేనే.. అని నిర్ణయం తీసుకున్నపుడు @ysjagan గారి బ్లాక్ పేపర్ రాసిన రాతలు, వైకాపా నాయకుల కూతలు ఇవి. (2/4)
— Lokesh Nara (@naralokesh) November 7, 2019
‘అప్పట్లో టీడీపీ సర్కారు నగరపాలక పరిధిలోని స్కూళ్లలో విద్యార్థుల సమ్మతితో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తే, “తెలుగు లెస్సేనా!”, “ఎందుకింత తెగులు..?”, “ఏకపక్ష నిర్ణయం”, “విద్యకు దూరమయ్యే ప్రమాదం”, “మాతృభాషపై అంత అక్కసు ఎందుకో”, “డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి”, “విద్యార్థులకు నష్టమే” అని జగన్ గారి బ్లాక్ పేపర్ రాసింది. వాటినే వైసీపీ నేతలు కూశారు.ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? ముందస్తు అధ్యయనం, ప్రణాళికలు అక్కర్లేదా? ఎలాంటి కసరత్తు లేకుండా ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చడం జగన్ గారి మరో అనాలోచిత నిర్ణయంగా భావిస్తున్నాం. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలి. ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి’ అని లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
ప్రభుత్వ తొందరపాటు చర్యల వలన తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే మళ్ళీ ఒకసారి సమీక్షించుకోవాలి. హడావిడి గా ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చెయ్యాలి. (4/4)
— Lokesh Nara (@naralokesh) November 7, 2019
వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేయడం పట్ల తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో చదువుకునే విషయమై పిల్లలు, వారి తల్లిదండ్రులు తమకు ఏది కావాలో ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం ఏమిటని భాషావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వివిధ రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి విడుదల చేసిన జివో 81ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.