తిరుపతి మార్చి 2 : విద్యాభివృద్థికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయడంలేదని సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాకు ఎంతో సన్నిహితుడని అంటూనే ఆయనపై, ఆయన ప్రభుత్వంపై మోహన్ బాబు విమర్శలు గుప్పించారు.
విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే స్వయంగా చెప్పారని, కానీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయానికి వస్తే..అనుకున్న సమయానికి ఏనాడూ సరిగ్గా ఇవ్వలేదని మోహన్ బాబు మండిపడ్డారు. అప్పుడప్పుడు భిక్షమేస్తున్నట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారని ఆయన అన్నారు.
విద్యానికేతన్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని మోహన్ బాబు ఆరోపించారు.
చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడని మోహన్ బాబు అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి.. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారు? అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు.
చివరిలో నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు,ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటం లేదని ఆయన స్పష్టం చేశారు.