తెలుగులో బాగా పాపులరైన రియాల్టీ షో బిగ్ బాస్. నాలుగేళ్లుగా టీవీ వీక్షకులు బిగ్ బాస్ ను అమితంగా ఆదరిస్తున్నారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే.. కరోనా నేపథ్యంలో ఈ షో ఉంటుందో లేదో అనే అనుమానాలు వచ్చాయి. కానీ.. వీటన్నింటికీ బ్రేక్ వేస్తూ బిగ్ బాస్ సీజన్ 4 మొదలవబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది.
నాలుగో సీజన్ కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈమేరకు బిగ్ బాస్ నిర్వాహకులు నాగ్ నే సంప్రదించారని అంటున్నారు. కరోనా నేపథ్యంలో షో నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నాగార్జున కూడా తన వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు సూచించారని సమాచారం. షూటింగ్ ఆన్ లొకేషన్లో చాలా తక్కువమంది స్టాఫ్ ఉండాలని సూచించారట. కంటెస్టెంట్స్ తో నేరుగా ఇంటరాక్షన్ కూడా వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రోగ్రామ్ మాదిరిగానే కెమెరా నుంచే వారితో ఇంటరాక్ట్ అవుతారని తెలుస్తోంది. కరోనా తీవ్రతతో నిర్వాహకులు ఈ షోను 100 రోజుల నుంచి దాదాపు 60 రోజులకు కుదించినట్టు తెలుస్తోంది.
నాగార్జున కోసం ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసారని అంటున్నారు. గతంలో మాదిరిగా శని, ఆదివారాలు కాకుండా ఒక రోజే నాగ్ టీవీలో కనిపించేటట్టు ప్రోగ్రామ్ డిజైన్ చేశారని అంటున్నారు. బిగ్ బాస్ షోలో పలు మార్పులు తీసుకొస్తున్నా కంటెంట్ పరంగా వీవర్స్ ను ఆకట్టుకునేట్టు మంచి టాస్క్స్ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలన్నింటిపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.