హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా)లో సభ్యుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నప్పటికీ గొడవలు సద్దుమణగడం లేదు. తాజాగా ‘మా’ అధ్యక్షుడు నరేష్పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ కమిటీ సుదీర్ఘమైన లేఖ రాయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు తొమ్మిది పేజీల లేఖను ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ రాశారు. ఈ లేఖలో 16 మంది సభ్యులు సంతకాలు చేశారు. నరేష్పై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
‘మా’ అభివృద్ధికి నరేష్ అడ్డంకిగా మారారని, అంతేగాక నిధులు దుర్వినియోగం చేయడం, ఈసీ సభ్యులను అవమానపర్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. నరేష్ నిర్ణయాలతో ‘మా’ పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని పేర్కొన్నారు. ‘మా’ సభ్యులు ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై నరేష్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి జీవిత విజ్ఞప్తి చేశారు. ‘మా’ క్రమశిక్షణ సంఘంలో సినీ నటుడు కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధ ఉన్నారు.
ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా 2020 ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు రాజశేఖర్ మా అధ్యక్షుడు నరేష్ తోపాటు కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్.. తర్వాత తన పదవికి రాజీనామా చేయడం క్రమశిక్షణా కమిటీ దానిని ఆమోదించడం జరిగిపోయింది. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!