ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’ వివాదాల్లో చిక్కుకునేలా ఉంది. సినిమాలో రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటించనున్నాడు. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇప్పుడీ సినిమాపై వివాదం రాజుకోవడానికి రావణ పాత్రధారి సైఫ్ ఆలీఖాన్ చేసిన వ్యాఖ్యలే కారణమయ్యాయి. ఏకంగా ఈ అంశంపై రాజకీయ నాయకులు స్పందించడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. సైఫ్ ఆలీఖాన్ వ్యాఖ్యాలపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పందించి ఏకంగా సైఫ్ ఖాన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ‘ఆదిపురుష్’ సినిమా దేశవ్యాప్త చర్చల్లో నిలిచింది. అసలేం జరిగిందంటే..
ఓ మీడియా ఇంటరాక్షన్ లో సైఫ్ ఆలీఖాన్ మాట్లాడుతూ.. ‘రామాయణం కథ గురించి అందరికీ తెలిసిందే. అనేక మంది రామాయణ గాధను తెరపై చూపించారు. ఈసారి మేము మరింత కొత్తగా చూపించడానికి సిద్ధమవుతున్నాం. ఈ సినిమాలో లంకేశుడి పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. అయితే.. సీతను రావణుడు ఎత్తుకెళ్లడానికి.. రాముడితో యుద్ధం చేయడానికి కారణం సూర్పణకను లక్ష్మణుడు అవమానించాడు కాబట్టే అనే కోణంలో రావణుడి పాత్రను పాజిటివ్ గా చూపించబోతున్నాం’ అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలే వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సైఫ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. రామాయణ కథను వక్రీకరించి చూపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.
దీంతో సైఫ్ ఆలీఖాన్ వెంటనే స్పందించారు. ‘నా మాటలు ఎవరినైనా బాధిస్తే క్షమించండి. మీడియాతో మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకుంటున్నాను. నా మాటలు తప్పుగా వెళ్లాయి. నా దృష్టిలో రాముడు ధీరోదాత్తుడు.. ధర్మానికి చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయంగా ఆదిపురుష్ ఉంటుంది. చరిత్రను వక్రీకరించకుండా సినిమా తీస్తాం. టీమ్ కూడా ఇందుకే శ్రమిస్తోంది.’ అని వివరణ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతానికి వివాదం సమసినా.. ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదం రాజుకుందనే చెప్పాలి. టీసిరీస్ సంస్థ ఈ సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. 2022 ఆగస్టులో సినిమా విడుదల కానుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!