YCP MP Vijaya Sai: టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ కలవడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేశారు. సీట్ల సర్దుబాటుపైనా అవగాహన కుదిరింది. అయితే ఈ పొత్తులపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విజయసాయి తన దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014 -19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం అబద్దాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు అని విమర్శించారు. ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందని, సుస్ధిర ప్రభుత్వం కోసం వైఎస్ఆర్ సీపీకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్డీఏలో టీడీపీ మళ్లీ చేరడంపై పలువురు తప్పుబడుతున్నారు. నాడు ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుండి బయటికి వచ్చానని చెప్పుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఏ హామీతో ఎన్డీఏలో చేరుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనం కోసమా.. సొంత పార్టీ ప్రయోజనం కోసమా అని నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబుపై వ్యతిరేకులు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.