కరోనా మహమ్మారి ప్రపంచం లోని అన్ని దేశాలను వణికిస్తోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్..ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. దీని ప్రభావం ప్రముఖ పుణ్య క్షేత్రాలపైనా పడింది.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రను సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించింది సౌదీ అరేబియా. ప్రతి ఏటా వివిధ దేశాల నుండి హజ్ యాత్రకు రెండున్నర లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది తమ దేశంలో ఉన్న పది వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తోంది సౌదీ. ఆగస్టు నెలలో జరిగే హజ్ యాత్రలో… సౌదీ అరేబియాకు చెందిన వారు 30 శాతం ఉంటారు. మిగతా దేశాలకు చెందిన వారు 70 శాతం మంది ఉంటారు. ఈ 70 శాతం మంది సౌదీ అరేబియాలో నివసిస్తున్నవారే.
కరోనా కారణంగా హజ్ యాత్రను అత్యంత ఆరోగ్య చర్యలతో నిర్వహించాలని సౌదీ పాలకులు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం… మక్కాలోని జామ్జామ్ బావి నుంచి భక్తులు స్వీకరించే పవిత్ర జలాన్ని ఈ సారి ప్లాస్టిక్ బాటిళ్లలో ఇవ్వనున్నారు. అందు వల్ల ఎవరైనా సరే… ఈ సారి పవిత్ర జలాన్ని బాటిళ్లలోనే అందిస్తారు. కాబాలో విసిరే గులక రాళ్లను ముందుగానే స్టెరిలైజ్ చేయనున్నారు. సాధారణంగా ఈ రాళ్లు హజ్ యాత్రా మార్గంలో లభిస్తాయి. వీటిని విసిరడం ద్వారా… చెడును తరిమేస్తారు. ఈ సారి ఈ రాళ్లను సీల్ చేసిన సంచుల్లో ఇవ్వనున్నారు. యాత్రకు వెళ్లిన రోజునే వాటిని ఇస్తారు.
ఈసారి కాబాలో నల్ల రాయిని యాత్రికులు ఎవరూ ముట్టుకోవడానికి వీలు లేదు. ఈ కట్టడం చుట్టూ బారికేడ్ లను ఏర్పాటు చేశారు. దీనితో ఎవరూ దాన్ని ముట్టుకునే అవకాశం ఉండదు.
మసీదులో ఉండే కార్పెట్ లను తొలగించనున్నారు. యాత్రికులు స్వయంగా రగ్గులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే యాత్రికులంతా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని సౌదీ పాలకులు తెలిపారు. మసీదులోకి, ప్రాంగణంలోకి బయటి నుంచి ఆహారాన్ని అనుమతించరు. యాత్రికులకు ప్యాక్ చేసిన ఆహారాన్ని అందిస్తారు.
వచ్చే యాత్రికుల ఉష్ణోగ్రతను అధికారులు పరీక్ష చేస్తారు. యాత్రికులతో వచ్చే వారిని కూడా ధెర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. యాత్రలో ఉన్నంత సేపూ వేర్వేరు ప్రాంతాల్లో ఈ పరీక్ష లు నిర్వహిస్తారు.