Pawan Kalyan: జనసేన కార్యకర్తలు ప్రతి సభలో సీఎం .. సీఎం అని నినాదాలు చేస్తుండటం, ఇటీవల సీనియర్ నేత హరేరామ జోగయ్య ..సీఎం పదవి ఆఫర్ చేస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనీ లేకుంటే ఒంటరిగానే జనసేన పోటీ చేయాలని సూచించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. పదవులు కోరుకోకూడదని, అవి వాటంతట అవే రావాలన్నారు. బలం నిరూపించుకోకుండా సీఎం పదవి ఎలా అడుగుతామని ప్రశ్నించారు. ఎన్నికల్లో 20 – 30 స్థానాలు గెలిచి ఉన్నట్లయితే, కర్ణాటక లో కుమారస్వామి మాదిరిగా సీఎం పదవి వచ్చేదన్నారు. షరతులు పెట్టి ముఖ్యమంత్రి పదవిని సాధించలేమని అన్నారు. బలాన్ని బట్టి సీట్లు అడుగుతామని చెప్పారు. జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.
తన సత్తా ఏమిటో చూపించి అప్పుడు ముఖ్యమంత్రి పదవి అడుగుతానని, అంతే తప్ప ముందుగా సీఎం పదవి కావాలని చెప్పి పొత్తులు కుదుర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై విముఖతతో ఉన్న పార్టీలను ఖచ్చితంగా ఒప్పిస్తామని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో బీజేపీ కేంద్ర పెద్దలతో ఈ విషయాలపైనే చర్చించానన్నారు. ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వస్తున్నందున జూన్ 3వ తేదీ నుండి ఇక్కడే ఉంటాననీ, ప్రజా సమస్యలపై పోరాడతానని పవన్ తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీని ఓడించేందుకు బేషరతుగా పొత్తులు పెట్టుకోవడానికి పవన్ సిద్దంగా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. బీజేపీతో కలుపుకుని టీడీపీతో కలిసి వెళ్లాలన్న ప్రయత్నంలోనే పవన్ ఉన్నట్లు తెలుస్తొంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో 30 శాతం పైగా ఓటింగ్ ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మిగిలిన నియోజకవర్గాల్లో గతం కంటే మెరుగ్గా ఉందని చెప్పారు. పొత్తులు కూలానికి సంబంధించినవి కాదనీ రాష్ట్రానికి సంబంధించినవి అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తల గురించి మాట్లాడానని పేర్కొన్నారు.
తమ బలాన్ని బట్టే సీట్లు అడుగుతామని చెప్పిన పవన్ కళ్యాణ్.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా పొత్తుల వల్లే బలపడ్డాయి అన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ గౌరవానికి భంగం లేకుండా పొత్తుల విషయంలో ముందుకు వెళతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ నుండి అధికారం తీసేసుకోవాలి, ప్రజలకు అధికారం అప్పగించాలి ఇదే మా లక్ష్యమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. వామపక్షాలతో కలిసి వైసీపీపై పోరాటం చేయాలని తనకు ఉంది కానీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉంటాయన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
సీ హారియన్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించిన సీఎం జగన్