భారతీయ జనతా పార్టీ (బీజేపి) దేశంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను ఇంతగా వాడుకోవచ్చా..? నాయకులను ఇంతగా కంట్రోల్ చేయవచ్చా..? వ్యవస్థలను ఇంతగా గుప్పిట్లో పెట్టుకోవచ్చా..? అనేంతగా రాజకీయాలు చేయడంలో ఆరితేరింది. అదే బీజేపీ పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బొమ్మలా చేసి ఆడుకుంటుందా..? లేదా..పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి ఉపయోగమా ..? లేక బీజేపీ వల్ల పవన్ కళ్యాణ్ కి ఉపయోగమా..? బీజేపీ – జనసేన పొత్తుతో ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉందా..? లేదా..కనీసం బీజేపీ – జనసేన పొత్తుతో జనసేనకు ప్రయోజనం ఉందా..? లేదా.. పవన్ కళ్యాణ్ ఏమైనా మైలేజీ వచ్చిందా..? లేదా..! మైనస్ ఏమిటి.. ? ప్లస్ ఏమిటి..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే…
బీజేపీ -జనసేన ఉమ్మడి కార్యక్రమాలు నిల్
పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు 2020 జనవరిలో పెట్టుకున్నారు. 2020 జనవరి నెలాఖరులో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణలు మీడియా సమావేశంలో పొత్తుల విషయాన్ని వెల్లడించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం మంచిదే అని ఆనాడు చాలా మంది భావించారు. అయితే వారు ఏ సిద్ధాంతాలు, విధానాలతో పొత్తు పెట్టుకున్నారో ఇప్పటి వరకూ వాటిని అమలు చేయలేదు. ఆ రెండు పార్టీల మొదటి మీడియా సమావేశంలో రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా విజయవాడ వంతెనపై ర్యాలీ చేస్తామని ప్రకటించారు. ఉమ్మడిగా ప్రకటించిన మొదటి కార్యక్రమం అది. కానీ అది జరగలేదు. వాయిదా వేసుకున్నారు. నెలలు, సంవత్సరాలు గడిచి పోతున్నా ఉమ్మడిగా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. రీసెంట్ గా విశాఖలో జనసేన పార్టీకి ఎదురైన సంఘటన అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ ను బయటకు రాకుండా హోటల్ లోనే నిలుపుదల చేశారు. వంద మంది నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కొంత మంది మీద హత్యాయత్నం కేసు పెట్టారు. కేంద్రంలో అధికారంలో అన్న బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పవన్ కు తిప్పలు తప్పలేదు.
అంత ఘటనలు విశాఖలో జరిగితే ఆ ప్రాంత బీజేపీ నేతలు సంఘీభావంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లారా ..? అంటే లేదు. ఉత్తరాంధ్ర నుండి ఒక్క నాయకుడు మాత్రమే వెళ్లారు. బీజేపీ, వైసీపీ ఉన్న లాలూచీ రాజకీయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుండి సీఎంఓ కు ఫోన్ చేసి జనసేనపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అని ఫోన్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదా..? బీజేపీకి వైసీపీకి అంతర్గత బంధం వల్లనే కేంద్రంలో బిల్లుల ఆమోదానికి మద్దతు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీ – జనసేన బహిరంగ పొత్తు ఉన్న నేపథ్యంలో జనసేనతో కలిసి బీజేపీ కార్యక్రమాలు చేయాలి. జనసేనకు ఇంత జరిగితే బీజేపీ రాజకీయం చేయలేదు..! వ్యవహారమూ చేయలేదు..! ఇలాంటప్పుడు బీజేపీతో పవన్ కళ్యాణ్ కు ఏమిటి ఉపయోగం..? తమ కార్యకర్తలపై దాడులు, కేసులు అడ్డుకోవడం కోసమే రాష్ట్రంలో బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యం నెరవేరడం లేదు. కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు జనసేనలో అంతర్గంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు విషయంలో పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. బీజేపీ వ్యతిరేక వాయిస్ వినిపించడానికి పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు.