వైసీపీ ఎమ్మెల్యేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పు చూపుతూ పరుష పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ నేడు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో రైతుల క్లీయరెన్స్ పత్రాల అందజేత కార్యక్రమ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. బూతులు తిట్టడం ఈ మధ్య కాలంలో ఏ స్థాయిలోకి వెళ్లారో చూశామనీ, వీధి రౌడీలుగా మారిపోయారన్నారు. చెప్పులు చూపుతూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్లు మన నేతలా అని అనిపిస్తొందని అన్నారు. దత్త పుత్రుడితో దత్తతండ్రి ఏమని మాట్లాడిస్తున్నారో మనం అంతా చూస్తున్నామన్నారు. మూడు రాజధానుల వల్ల న్యాయం జరుగుతుందని మనం భావిస్తుంటే, మూడు పెళ్లిళ్ల వల్లనే మేలు జరుగుతుందని మీరూ చేసుకోండి అని మాట్లాడేవాళ్లు ఉన్నారని జగన్ వ్యంగ్యంగా విమర్శించారు.

మన పాలన, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెన్నుపోటు దారులంతా ఎవరికీ మంచి చేయలేదన్నారు. దుష్ట చతుష్టయం మన ప్రభుత్వంపై యుద్దం చేస్తుందట, ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంత మంది ఏకమవుతుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్దమని పేర్కొన్నారు. పేద వారికి, పెత్తందారులకు జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు. వెన్నుపోటుదారులు కూడా నీతులు మాట్లాడుతుంటే వినలేకపోతున్నామని అన్నారు జగన్.

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వాటిని తొలగించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళుతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి భూముల రీసర్వేను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామన్నారు. కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే చేస్తున్నామని చెప్పారు. 22(1) ఏ కింద నిషేదిత భూముల సమస్యను పరిష్కరిస్తూ రైతులకు పట్టాలు అందించే కార్యక్రమం ఈ రోజు ప్రారంభించామన్నారు. నవంబర్ 1500 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి సరిహద్దులు నిర్ణయించడంతో పాటు భూహక్కు పత్రాలు అందజేయడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామాల్లో ఉండేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రైతులకు తమ తమ భూములపై పక్కా పత్రాలతో సర్వహక్కులు అందేలా చూడటమే తమ అభిమతమని సీఎం స్పష్టం చేశారు.
YSRCP: ఎన్నికలు రేపు అన్నట్లుగా క్యాడర్ పని చేయాలని ఉద్భోదించిన వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్