Petrol, Diesel Price: పెట్రోల్ ధరల పెరుగుదలకు కళ్లెం పడటం లేదు. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు, డీజిల్ ధర 85 పైసలు పెరిగింది. ఇంధన ధరల తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కి, డీజిల్ లీటరుకు రూ.94.67కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.41, డీజిల్ రూ. 102.64. చేరుకుంది. మార్చి 22 నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశంలో పెట్రోల్ ధరలను పెంచడం ప్రారంభించడంతో పెట్రోలు లీటరుపై ఎనిమిది రూపాయలు పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రో ధరలను పెంచడం, స్థానిక పన్నుల సంభవనీయతను బట్టి రాష్ట్రాల వారీగా ధరలు మారుతున్నాయి.
Petrol, Diesel Price: మార్చి 22 నుంచి
నవంబర్ 4, 2021 నుంచి చమురు ధరలు దేశ వ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత అంటే మార్చి 22న మొదటిసారిగా ధరలు పెంచారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు 13 రోజుల్లో 11 సార్లు చమురు ధరలు పెరిగాయి. గత 13 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఎనిమిది రూపాయలు పెరిగింది. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా ప్రస్తుతం లీటరుకు రూ.103.41కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 75 పైసలు చొప్పున పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.96, డీజిల్ లీటరుకు రూ.99.04 పెరిగింది.తెలంగాణ రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.13లకు చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ.103.20గా ఉంది. ఏపిలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.15 ల వరకూ పెరగ్గా, లీటర్ డీజిల్ ధర రూ.105.50లకు చేరింది.
అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత
దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెట్రోల్ ధరలు పెరగకుండా జాగ్రత్త వహించింది. ఎన్నికలు ముగిసిన రెండో రోజు నుండి ధరల పెరుగుదల ప్రారంభం అయ్యింది. దీన్ని బట్టే ధరల నియంత్రణ కేంద్రం చేతిలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ముందే పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని ఆనాడే చెప్పింది. ఇది మొత్తం కేంద్రంలోని బీజేపీ డ్రామాగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ధరల అదుపు వాళ్ళ చేతుల్లోనే ఉందని పేర్కొంటున్నారు. ఎన్నికలు ఉంటేనే ధరలు పెరగకుండా చూస్తారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధర పెరుగుతోంది. ఈ కారణంగా పెట్రోలు, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మార్చి మొదటి మూడు వారాల్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు సగటున 111 డాలర్లకు పెరిగాయి. రెండు వారాల వ్యవధిలోనే లీటరు పెట్రోల్ పై రూ.8లు పెరిగింది.