శ్రీలంక నూతన అధ్యక్షుడుగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు. తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోయి అక్కడి నుండి రాజీనామా లేఖ పంపడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం శ్రీలంక పార్లమెంట్ లో అధ్యక్ష ఎన్నిక నిర్వహించగా, మెజార్టీ సభ్యులు రణిల్ విక్రమ్ సింఘే కు మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యులు ఉన్న శ్రీలంక పార్లమెంట్ లో 134 మంది విక్రమ్ సింఘేకు ఓటు వేశారు. విక్రమ్ సింఘే కు ప్రధాన ప్రత్యర్ధి, శ్రీలంక అధికార పక్షమైన పొదుజన పెరమున (ఎస్ఎల్పీసీ) నేత దులస్ అలహప్పెరుమాకు 82 మంది మద్దతు లభించింది. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అసూర కుమార దిశనాయకే కు కేవలం ముగ్గురు ఓట్లు వేశారు.
శ్రీలంక పార్లమెంట్ తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. శ్రీలంకలో ప్రజలే నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రజలతో ఎన్నుకోబడిన అధ్యక్షుడు రాజీనామా చేసిన పక్షంలోనే పార్లమెంట్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబాయ రాజపక్స 2024 నవంబర్ వరకూ పదవిలో ఉండాల్సి ఉంది. ఆయన స్థానంలో ఇప్పడు కొత్తగా ఎన్నికైన విక్రమ్ సింఘే ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. కాగా రణిల్ విక్రమ్ సింఘే శ్రీలంకకు ఆరు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గడచిన ఎన్నికల్లో రణిల్ విక్రమ్ సింఘేతో సహా ఆయన పార్టీ సభ్యులు అందరూ ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా విక్రమ్ సింఘే పార్లమెంట్ సభ్యుడుగా నామినేట్ అయ్యారు. దేశంలో ఆర్ధిక , రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స రాజీనామాతో కొద్ది రోజుల క్రితమే ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే బాధ్యతలు చేపట్టారు.
గొటబాయి రాజపక్స పరారీ తర్వాత విక్రమ్ సింఘే తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు సభలో మెజార్టీ సభ్యుల మద్దతుతో పూర్తి స్థాయి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అయితే విక్రమ్ సింఘే పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆయన గొటబాయ రాజపక్స కుటుంబ దేశం వదిలి పారిపోవడానికి సహకరించారని శ్రీలంక వాసులు మండిపడుతున్నారు. ఇంతకు ముందు ఆయన భవనాన్ని నిరసనకారులు చుట్టిముట్టారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎంపీలు విక్రమ్ సింఘేని అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ తరుణంలో దేశంలో ఆర్ధిక సంక్షోభం, ఆందోళనల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత రణిల్ విక్రమ్ సింఘే మాట్లాడుతూ “దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనం చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది” అని పేర్కొన్నారు.