ప్రకాశం జిల్లాల్లో రివర్స్ రాజకీయం మొదలయ్యింది.ఇప్పటివరకు టిడిపి నేతలు పలువురు వైసీపీలో చేరగా ఇప్పుడు వైసిపి నేత, మాజీ శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీలో చేరబోతున్నారు.
ఎంపీపీ గాను, జిల్లా పరిషత్ చైర్మన్ గానూ రెండుసార్లు ఎమ్మెల్యేగా ను పనిచేసిన డేవిడ్ రాజు జిల్లాలో సీనియర్ దళిత రాజకీయ నాయకుడు.అయితే ఆయన వైసిపికి పాతకాపే.2014 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్ రాజు తదుపరి టిడిపిలో చేరారు.కానీ 2019లో చంద్రబాబు నాయుడు ఆయనకు ఎర్రగొండపాలెం టిక్కెట్ ఇవ్వలేదు.దీంతో ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.కానీ వైసిపిలో ఆయనకు ప్రాధాన్యత కరువైంది పైగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గా ఉన్న ఆదిమూలపు సురేష్ జిల్లాలో మంత్రిగా కూడా ఉండటంతో డేవిడ్ రాజుకు వైసిపిలో ఉండి ఏ ప్రయోజనమూ లేని పరిస్థితి ఏర్పడింది.ఎస్సీలకు రిజర్వ్ అయిన ఎర్రగొండపాలెంలో కూడా టిడిపికి ఒక గట్టి నాయకుడు కావాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని డేవిడ్రాజు తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.నిజానికి డేవిడ్రాజు రాజకీయ ప్రస్థానం అంతా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది.అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆయన సైకిల్ ఎక్కబోతున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ రావు ఆదివారంనాడు డేవిడ్ రాజునివాసానికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు ఈ సందర్భంగా తాను అతి త్వరలోనే టిడిపిలో చేరబోతున్నట్లు పాలపర్తి ప్రకటించారు. ఆయన టిడిపిలో చేరబోవటం వార్త కాకపోవచ్చు గానీ వైసిపి నేత ఒకరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.మొన్నటి ఎన్నికలు ముగిశాక చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తో సహా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తదితరులు టిడిపి నుండి వైసిపిలోకి వచ్చారు.ఇప్పుడు ఒక సీనియర్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుండి టిడిపిలోకి వెళుతుండడం కచ్చితంగా విశేషమే!