వైసిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా మరోసారి మాజీ మంత్రి నారాలోకేష్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో లోకేష్ కి పప్పు అని పేరు పెట్టిన రోజా ఈసారి ఆయనను దద్దమ్మ అంటూ ఎద్దేవా చేశారు.నారా లోకేష్ ముఖ్యమంత్రి కొడుకై ఉండి మంత్రిగా ఉంటూ కూడా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ గేలి చేశారు.
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా కరోనా వైరస్ భయాందోళనలో ఉన్న వేళ, దగ్గరుండి భరోసాను ఇవ్వాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన కుమారుడు లోకేశ్ తో కలిసి పక్క రాష్ట్రానికి పారిపోయి, దాక్కున్నారని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్టీలో ఉన్న అవినీతి గద్దల కోసం హైదరాబాద్ విడి ఏపీకి పరుగులు తీశారని, చంద్రబాబుకి, లోకేష్ కి కేవలం అధికారం, డబ్బు మాత్రమే కావాలని, ప్రజలపై ఏమాత్రం అభిమానం లేదని ఆరోపించారు. అలాగే సంవత్సర పరిపాలనలోనే సీఎం జగన్ తాను ఇచ్చిన హామీలు దాదాపు 100 శాతం పూర్తి చేశారని చెప్పారు. కరోనా కట్టడి కోసం ఎక్కువ మందికి టెస్టులు చేసి కరోనా నియంత్రణలో ముందున్న రాష్ట్రం ఏపీగా అని, ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ ఉచితంగా సీఎం జగన్ అందిస్తున్నారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, పలు రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని రోజా వ్యాఖ్యానించారు.
దీంతో ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అబ్బా కొడుకులు అవాకులు చవాకులు పేలుతున్నారని రోజా కౌంటర్ ఇచ్చారు.ఇకపై లోకేష్ నిక్ నేమ్ దద్దమ్మగా మిగిలిపోతుందేమో చూడాలి.