తెలుగు ప్రజల అందరి చూపు పడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార పర్వంపై కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఓ వైపు అన్ని ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారంతో గ్రేటర్ను చుట్టుముడుతున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. వాటిల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మించి హామీలు ఇచ్చాయి.
ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో , అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ సమయంలో గ్రేటర్ ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ తెరమీదకు వచ్చింది.
హైదరాబాద్ ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్
ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల సమయంలో ఉచిత వ్యాక్సిన్ అంశం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ,
గ్రేటర్ ఎన్నికల్లో కూడా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తారా అనే ప్రచారం ఊపందుకుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటుంది, ఎంత ధరకు దొరుకుతుంది? అనే ప్రచారం ఎంత జరుగుతుందో..గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఉచితంగా అందిస్తారా లేదా అనే దానిచుట్టూనే ప్రచారం జరుగుతోంది.
ఇటు కేసీఆర్ అటు మోదీ
ఓ వైపు ఎన్నికల పర్వంలో ఉచిత వ్యాక్సిన్ గురించి చర్చ జరుగుతుంటే…మరోవైపు ముఖ్య నేతల ప్రచారం ఇంకా హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 28 వ తేదీన ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అదే రోజున ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న పురోగతిని పరిశీలించేందుకు హైదరాబాద్లో ప్రధాని అడుగు పెట్టబోతున్నారు. 3:40కి ప్రధాని హైదరాబాద్ వస్తారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించిన అనంతరం 5:40కి తిరిగి పూణే బయలుదేరి వెళ్తారు. ఎన్నికలకు సమయం కావడంతో కరోనా వ్యాక్సిన్ గురించి ఈ ఇద్దరు నేతలు ఏదైనా ప్రకటన చేస్తారా? అనే చర్చ జరుగుతోంది.