టీడీపికి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందనే అనుకోవాలి. చంద్రబాబుకు సన్నిహిత నేతగా పేరున్న శిద్ధా రాఘవరావు వైసీపీ చేరారు. శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ ఇద్దరికీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఇది నిజంగానే టీడీపీకి గట్టి దెబ్బ అనే చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లాలో ఈయన టీడీపీకి కీలక నేతగా ఉన్నారు.
అయితే… ఇప్పటికే టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచినవారు, గెలవనివారు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరడంపై పెద్దగ కామెంట్లు చేయని చంద్రబాబు… తనకు అత్యంత సన్నిహితుడైన సిద్ధా రాఘవరావుపై మాత్రం కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. సిద్ధా పార్టీ మారడాన్ని పిరికితనంగా అభివర్ణించిన బాబు… ప్రలోభాల కోసమే పార్టీ మారుతున్నారని అంటున్నారు. ఇది రాఘవరావుకు ఊహించని ట్విస్టే అని చెప్పాలి. ఎందుకంటే… టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడంలో సిద్ధా మొదటివ్యక్తేమీ కాదు!
ఆ సంగతులు అలా ఉంటే… ప్రకాశం జిల్లాలో టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముందుగా ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత జగన్ కు జైకొట్టగా… ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఇదే క్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా అదే బాటలో నడిచారు. కాగా… శిద్దా రాఘవరావు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు.. ఇదే క్రమంలో చంద్రబాబుకు సన్నిహిత నేతగా పేరుంది. ఒంగోలు నుంచి 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి టీడీపీలోనే కొనసాగిన ఆయన… 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు.