తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్ది జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని టచ్ చేస్తే ఏపీలో తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో నేనే రాజు..
నేనే మంత్రి అన్నట్టు పాలన సాగుతోందని, తానైతే టీడీపీనీ వీడేది లేదని, వైసీపీలో చేరేది లేదని అన్నారు. తాను కూడా ఎప్పుడు అరెస్ట్ అవుతానో తనకు తెలియదని అయినా దేనికైనా నేను రెడీగా ఉన్నానని అన్నారు.రాజకీయ కక్ష్య సాధింపు చర్యలతో జగన్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు.తాను ముందు నుంచే జగన్ పాలనా విధానం ఎలా ఉంటుందో ఆయన మనస్తత్వం ఏమిటో చెబుతూ వస్తున్నానని,అదే ఇప్పుడు జరుగుతోందని దివాకర్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయని అధికార౦లో ఉన్నప్పుడు విర్రవీగితే అధోగతి తప్పదని జెసి శాపనార్థాలు పెట్టారు.నలభై ఏళ్ల రాజకీయ అనుభవం తనకుందని ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని కూడా జెసి చెప్పారు.భయపడే తత్వం తనది కాదని , బెదిరించి తనను ఎవరూ ఏమి చేయలేరని కూడా దివాకర్రెడ్డి అన్నారు.తన జోలికి వచ్చినా చంద్రబాబు నాయుడు వైపు చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన బల్లగుద్ది చెప్పారు.ఈ స్థాయిలో జగన్కు వార్నింగ్ ఇచ్చిన టిడిపి నేత ఎవరూ లేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.