కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అనేక రంగాలు నష్టాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆంక్షలను సడలించి నెమ్మదిగా కార్యకలాపాలను ప్రారంభించి ఇప్పటికే 3 నెలలు కావస్తున్నా అనేక రంగాలు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. ఇక బ్యాంకులు కూడా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నష్టాల బాట పట్టాయి. అయితే ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఇకపై బ్యాంకులు డిజిటల్ పేమెంట్లకు కూడా చార్జిలను వసూలు చేయాలని చూస్తున్నట్లు తెలిసింది.
దేశంలో ప్రస్తుతం అనేక మంది యూపీఐ ద్వారా, ఇతర డిజిటల్ వాలెట్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇవన్నీ సహజంగానే డిజిటల్ పేమెంట్ల కిందకు వస్తాయి. వీటిలో యూపీఐ పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్, నెట్ బ్యాంకింగ్ చెల్లింపులపై బ్యాంకులు చార్జిలను వసూలు చేయాలని చూస్తున్నట్లు తెలిసింది.
అయితే పెద్ద ఎత్తున నగదును పంపే లావాదేవీలపై కాకుండా చిన్న మొత్తంలో ఎక్కువ సంఖ్యలో జరిగే లావాదేవీలపై మాత్రమే చార్జిలను వసూలు చేస్తారని తెలుస్తోంది. దీనిపై బ్యాంకులు ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే దేశంలో ఓ వైపు డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ బ్యాంకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా చార్జిలను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై కేంద్రం ఏమంటుందో, అసలు బ్యాంకులు ఎప్పటి నుంచి ఇలా చార్జిలను వసూలు చేస్తాయో చూడాలి.