Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో సారి వాయిదా పడింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ కేసు విచారణ ను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది.
సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. మూడు వారాల తర్వాత విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఐడీ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ కౌంటర్ దాఖలునకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలిపారు.
చంద్రబాబు తరపున కౌంటర్ దాఖలు చేస్తూ విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు. తొలుత రెండు వారాల తర్వాత లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ విజ్ఞప్తితో ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
స్కిల్ డెవలపె మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.