YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ ఇప్పటికే లోక్ సభ, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగిస్తూ ఆరు జాబితాలు విడుదల చేసింది. దాదాపు 70కిపైగా అసెంబ్లీ, డజను ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది.
ఈ క్రమంలో అధికార పార్టీలో సీటు దక్కని నేతలు, ఆశావహులు వరుసగా పార్టీని వీడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే విపక్షాల తీర్ధం పుచ్చుకోగా, మరి కొందరు అదే బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పార్టీ వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆయన త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో డాక్టర్ ఏలూరి భేటీ కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. పురందేశ్వరితో జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తొంది. ఆయన రేపో మాపో వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ చేరతారని అంటున్నారు.
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మార్కాపురం నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమం కూడా చేశారు. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డిపై నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి టికెట్ ఆశించారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరు పార్టీ ఇన్ చార్జిగా నియమించి, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించడంతో పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరుతుందన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి జాతీయ పార్టీ బీజేపీలో చేరాలని భావిస్తున్నారని అంటున్నారు.