T Congress: తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై వి హనుమంతరావు, జగ్గారెడ్డి తో సహా మరి కొందరు సీనియర్ నేతలు ఆగ్రహాంతో ఉన్న నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ సీనియర్ నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అభిప్రాయ బేధాలు, విభేదాలు పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పార్టీ కోసం పని చేయాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంలో పార్టీ నేతలు అందరూ పని చేయాలని సూచించిన రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డికి సీనియర్ నేతలను కలుపుకుపోవాలని తెలిపారు.
ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలకు వివిధ పదవులు కట్టబెట్టి వారిని పీసీసీకి సహకరించేలా యాక్టివ్ చేయాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ స్టార్ క్యాంపియినర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏఐసీసీ నుండి ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇదే విధంగా మరి కొందరు సీనియర్ నేతలకు కూడా త్వరలో కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.