తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే భవిష్యత్తు లేని పార్టీగా రోజు రోజుకి దిగజారిపోతున్నట్లు ఇటీవల ఎన్నికల ఫలితాలు బట్టి చాలా మంది అంచనా వేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఢిల్లీ పెద్దలు అప్రమత్తమై పీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టబెట్టాలి అన్నదానిపై పార్టీలో సీనియర్ నాయకులతో పాటు కీలక నాయకుల దగ్గర అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఠాగూర్ ద్వారా నివేదిక రూపంలో తీసుకోవడం జరిగింది.
ఇటువంటి తరుణంలో పీసీసీ చీఫ్ పదవి విషయంలో పార్టీలో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు గట్టిగా వినబడ్డాయి. అయితే వీరిలో ఎక్కువ శాతం రేవంత్ రెడ్డి కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ నుండి గల్లీ దాకా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 30 తారీకు సమయంలో బీజేపీ పార్టీని ఒక్కసారిగా పొగడటం మాత్రమే కాక బీజేపీలో చేరబోతున్నట్లు తిరుమల పర్యటనలో ప్రకటించడంతో టీ కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.
పీసీసీ చీఫ్ పదవి విషయంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కోపం వచ్చినట్లు భావించారు. అయితే ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవి విషయంలో హై కమాండ్ కొద్దిగా తగ్గటంతో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయం సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు చెబుతానని తాజాగా తన నిర్ణయాన్ని వాయిదా వేయడంతో తెలంగాణ బీజేపీకి ఒక్క సారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. మొత్తంమీద చూసుకుంటే కాంగ్రెస్ హైకమాండ్ ని తనను బ్లాక్ మెయిల్ రాజకీయాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.