అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
వైద్య పరీక్షల కోసం గత శనివారం ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.
మిన్నెసోటా రాష్ట్రంలోని మేయో క్లినిక్లో గురువారం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తిరిగి వచ్చే రోజు చంద్రబాబు తనను కలవడానికి వచ్చిన కొందరు ప్రవాసాంధ్రులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. మొక్కజొన్న పేలాలు తింటూ స్థానిక వీధుల్లో వారితో సరదాగా కొద్దిసేపు నడిచారు. ప్రవాసాంధ్రులతో కలిసి ఆయన అక్కడ షాపింగ్ చేశారు. రెస్టారెంట్లో వారితో కలిసి రాజకీయాలు, ఇతర అంశాలు మాట్లాడారు.
ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సరదగా గడిపిన సందర్భంలో పలువురు తమ సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీశ్ వేమన, రామ్ చౌదరి తదితరులు చంద్రబాబుకు అమెరికాలో వీడ్కోలు పలికారు.