AP Elections: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు..! రెండు, మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న, వైరల్ అవుతున్న మాట. నిజానికి ‘ముందస్తు’ అనే పదం టీడీపీకే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రతిపక్ష నాయకుడి నుంచి సీఎం కావాలని చంద్రబాబు, ముందస్తు (AP Elections) ఎన్నికలు వస్తే టీడీపీని గెలిపించేసి చంద్రబాబును మళ్లీ సీఎంగా చూసుకోవాలని పార్టీలోని కార్యకర్త కూడా కోరుకుంటాడు. ఇదే ఉత్సాహంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్.. ఇదే వార్తను రాష్ట్రంలో వండి వడ్డిస్తోంది. నిప్పులేనిదే పొగ రాదనే సామెత చందాన.. రాజకీయ వర్గాల్లో ఈ మాట వినిపిస్తే టీడీపీ ప్రచారం చేసిందో.. లేదా తానే అగ్గి రాజేసినట్టు.. ఈ ప్రచారం చేసిందో కానీ.. టీడీపీ అత్యుత్సాహంపై వైసీపీ నీళ్లు చల్లేసింది.
AP Elections: గట్టి సమాధానం ఇచ్చిన వైసీపీ..
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అధికారం ఇచ్చారు.. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన మాకు లేదు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో (AP Elections) ఎన్నికలు జరుగుతాయి. అధికారం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రచారంగా దీనిని ఆయన కొట్టిపారేశారు. దీనిపై చంద్రబాబు తీరును విమర్శిస్తూ.. ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అనే నాయకులకు సీట్లు ఇస్తానంటున్న చంద్రబాబు.. ముందు కుప్పంలో టీడీపీ అభ్యర్ధిని మార్చుకోవాలని సెటైర్ వేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి స్థానికులు తగిన గుణపాఠం చెప్పినా చంద్రబాబు దీరు మారలేదని విమర్శించారు.
టీడీపీకి జరిగిందే వైసీపీకి జరగాలనే ప్లానేనా..
త్వరలో వైసీపీకి 3ఏళ్ల పాలన పూర్తవుతుంది. ఇంకా.. మంత్రివర్గ మార్పు జరగనేలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ జగన్ ముందుకెళ్తున్నారు. సీఎంగా జగన్ ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్దామన్నా కరోనా పరిస్థితులతో వెళ్లలేదు.ఇలా కాకుండా (AP Elections) ముందస్తు అంటూ ప్రజల్లోకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశమే ఉంది. కాబట్టి.. రచ్చబండతో కాకపోయినా, నాలుగేళ్ల పాలన పూర్తయ్యాక ఎన్నికల హడావిడి మొదలైపోతుంది. అప్పుడు ఒకేసారి ఎన్నికలకు వెళ్తారు. 2004లో ఏడాది ముందే ముందస్తుకు వెళ్లిన చంద్రబాబుకు జరిగిన అనుభవం దృష్ట్యా జగన్ ను టీడీపీ రాజకీయంగా రెచ్చగొడుతుందనే వ్యాఖ్యలూ లేకపోలేదు.