ఏపీలో పొత్తుల అంశంపై గత నెల రోజులుగా నానుతూ వస్తోన్న పొత్తు ఎట్టకేలకు పొడిచింది. దీనిపై అధికారిక ప్రకటన శనివారం వెనలువడనుంది. పవన్, చంద్రబాబు ఇద్దరూ ఢిల్లీలో మకాం వేసి ఎట్టకేలకు పొత్తు పోడిచేలా చేశారు. ఇక పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది ? ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నదాని మీదే క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు జనసేనకు ఇచ్చారు. ఇక బీజేపీ కూడా పొత్తులోకి రావడంతో మొత్తంగా రెండు పార్టీలకు కలిపి 30 అసెంబ్లీతో పాటు 8 పార్లమెంటు సీట్లు ఇస్తామని చెప్పారు.
ఇక ఢిల్లీలో భేటీలో అమిత్ షా కాస్త ఎక్కువగానే ఎంపీ సీట్లు అడిగారని సమాచారం. ఎంపీ సీట్లు ఎక్కువ కావాలని బీజేపీ హైకమాండ్ పట్టుబట్టడంతో జనసేన త్యాగాలకు సిద్ధం కాక తప్పట్లేదని తెలుస్తోంది. జనసేనకు మూడే పార్లమెంట్ సీట్లు ఇచ్చినా బీజేపీకి ఐదు సీట్ల వరకూ కేటాయిచాలని నిర్ణయించారు. ఇక బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లను ఫైనల్ చేశారు. ఏయే సీట్లు అన్నదానిపైనా స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ ఆరో పార్లమెంటు సీటు కూడా కావాలని పట్టుబడితే అప్పుడు జనసేన మరో పార్లమెంటు సీటు కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉందంటున్నారు.
వాస్తవానికి శనివారం ఉదయమే మూడు పార్టీల నేతలు పొత్తుల గురించి ప్రకటన చేయాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో పొత్తులు, పార్టీలతో చర్చల కారణంగా అధికారిక ప్రకటన ఆలస్యమైందని అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు నేపథ్యంలో టీడీపీ కేడర్ మానసికంగా సిద్ధమైంది. ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ కూడా ఎంటర్ కావడంతో టీడీపీ వాళ్లతో పాటు జనసేన కూడా మరికొన్ని త్యాగాలు చేస్తూ మరికొన్ని సీట్లు కూడా వదులుకోవాల్సి ఉంటుంది.
జనసేనకు గత ఎన్నికల్లో ఏకంగా 7 శాతం ఓట్లు వచ్చాయి. అయితే విచిత్రంగా 1 శాతం ఓట్లు కూడా లేని బీజేపీకి ఏకంగా 5 – 6 పార్లమెంటు సీట్లు ఇవ్వడం అంటే చాలా ఎక్కువే. అయితే బీజేపీతో పొత్తు ఉంటేనే ఏపీలో ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం జనసేన, టీడీపీకి ఉంది. దీంతో పాటు రేపు ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వం నడవాలంటే… కేంద్రం సహకారం తప్పనిసరి. దీంతో పాటు కేంద్ర ప్రాజెక్టులతో పాటు… ఈ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులతో ముందు ముందు…. వడ్డీలు చెల్లించడానికి ఆదాయం కూడా సరిపోదు.
అప్పుడు అయినా కేంద్రం సహకారం ఉండాల్సిందే. దీంతో పాటు వైసీపీ ఎదురు దాడులు తట్టుకోవడంతో పాటు రాజకీయంగా కూడా వైసీపీని పాతాళంలోకి తొక్కడానికి బీజేపీ సహకారం ఉండాలని పవన్, డిసైడ్ అయ్యారు. అందుకే పవన్, చంద్రబాబు కాస్త తగ్గి అయినా బీజేపీతో కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.