(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో వైసీపీ బాపట్ల ఎంపి నందిగం సురేష్ పై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తను ఆయన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గురువారం జరిగింది.
ఎంపి సురేష్ తెలిపిన సమాచారం ప్రకారం.. తాను వ్యక్తిగత పనులపై కారులో బయటకు వెళుతుండగా టీడీపీ నాయకుడు బత్తుల పూర్ణచంద్రరావు బుధవారం తన బైక్ ను కారుకు అడ్డంగా పెట్టి అడ్డుకోవడమే కాక తన పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దాడికి ప్రయత్నించాడన్నారు. ఈ సమయంలో తన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవడానికి ప్రయత్నించగా సమీపంలోని అమరావతి జెఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లోకి పారిపోయాడన్నారు. ఆ సమయంలో పూర్ణచంద్రరావు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ బయటపడిందన్నారు. తన సెక్యూరిటీ సిబ్బంది పూర్ణచంద్రరావును పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. అదే విధంగా నిందితుడు పూర్ణచందరావు తన పై దాడికి తీసుకువచ్చిన ఇనుప రాడ్ ను కూడా పోలీసులకు స్వాధీనం చేశామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.