ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో ఎన్నికలు రానున్నందున తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
దీంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే గడువు ఉండటంతో ఎలాగైనా ఈసారి టీఆర్ఎస్ గెలవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
దాని కోసమే టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఆరుగురు బీజేపీ కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరారు.
ఇంకా టీఆర్ఎస్ పార్టీలో వివిధ నాయకులు చేరుతూనే ఉన్నారు. నిజామాబాద్ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో త్వరలోనే పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు బీజేపీ జడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్ లో చేరారు.
మొత్తానికి తమకు కావాల్సిన ఆధిక్యాన్ని టీఆర్ఎస్ పార్టీ సాధించుకున్నా.. పార్టీలోకి వలసల జోరు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి.
ఈ ఎన్నిక కోసం 824 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయనుండగా… అందులో 75 శాతం వరకు టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. దీంతో కవిత గెలుపు లాంఛనమే అయిపోయింది.
ఇక.. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ను అక్టోబర్ 9 న నిర్వహించనున్నారు. అక్టోబర్ 12 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.