హైదరాబాద్: టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.
ఫోర్జరీ నేరం కేసులో రవిప్రకాష్తో సహా సినీనటుడు శివాజీలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు హజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పోలీస్ విచారణకు రవిప్రకాష్ హజరుకావాల్సిందేననీ, విచారణకు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్టు చేయడానికి వీలులేదనీ, ఒక వేళ అరెస్టు చేయాలంటే 48గంటల ముందు నోటీసు జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టులో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల విచారణకు రవిప్రకాష్ హజరయ్యారు.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై రవిప్రకాష్ తరపున ముందుగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దిల్జిత్ సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపించారు. తరువాత ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది నిందితుడు రవిప్రకాష్ తొమ్మిది శాతం ఉన్న షేర్లలో 40వేల షేర్లను 20లక్షల రూపాయలకు హీరో శివాజీకి చెల్లించినట్లు తప్పడు ద్రువపత్రాలు సృష్టించారనీ, నిజానికి ఫిబ్రవరి 2018న రవిప్రకాష్ నుండి ఎలాంటి షేర్లను శివాజీ కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. షేర్ల లావాదేవీలు చేసినట్లైయితే ఐటి లెక్కల్లో చూపించాలనీ, కానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఐటికి చూపించలేదని కోర్టుకు వివరించారు. ఎన్సిఎల్టిలో శివాజీ చేత రవిప్రకాష్ కావాలని కేసు వేయించారని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే రవిప్రకాష్ పారిపోవాల్సిన అవసరం లేదనీ, పోలీసుల విచారణకు పిలిచినా హజరుకాలేదని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల విచారణకు హజరయినా ఏ ఒక్క ప్రశ్నకు రవిప్రకాష్ సరైన సమాధానాలు చెప్పలేదని వివరించారు.
బెయిల్ మంజురు చేస్తే సాక్షాలను తారు మారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశారు.