న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్పై అభ్యంతరకరమైన పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టారన్న అభియోగంపై లక్నో జైలులో ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా అరెస్టును సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలిస్తుంది. కనోజియాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకుని లక్నోలో అరెస్టు చేశారు.
కనోజియా భార్య జగీషా అరోరా తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదిత్యనాధ్పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న కేసుసు సంబంధించి మొత్తం అయిదుగురని పోలీసులు అరెస్టు చేశారు. గోరఖ్పూర్లో ఆదివారం సాయంత్రం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రికి తాను పెళ్లి ప్రతిపాదన పంపానని ఒక మహిళ మీడియా ముందు చెప్పిన వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు కనోజియాను అరెస్టు చేశారు. ఈ వీడియోను ప్రసారం చేసినందుకు నోయిడాలో ఒక న్యూస్ ఛానల్ ఎడిటర్, యజమానినీ అరెస్టు చేశారు.