వై.ఎస్.ఆర్.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్ కార్యక్రమంలో ఆ షో యాంకర్ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్లో జరిగి ఉంటే ఆశ్చర్యం లేదు. అడిగిన వ్యక్తి బిజెపి నాయకుడు విష్ణు గారయితే ఆ చానల్ టీవీ 9. మరి యాంకర్ – రజనీకాంత్! రోజుల వ్యవధిలోనే ఓడలు పడవలు కాదు; కాగితపు పడవలు అయిపోయాయి అనిపిస్తోంది. ఒద్దన్నా తెలుగుదేశం పార్టీకి యాంకర్లు మద్దతు ఇస్తారనే ప్రచారం ఉండేది. రాజకీయ పరిస్థితి తారుమారు అయి రెండువారాలు గడిచిందో, లేదో తెలుగు వార్తా చానళ్లు ఆశ్చర్యకరంగా మారిపోయాయి. విష్ణు-రజనీ ఉదాహరణ ఇవ్వడం కేవలం ఈ ధోరణికి ఒక దృష్టాంతం గురించి పేర్కొనడానికే! ఇరవయ్యో, పాతికో చానళ్ళు న్యూస్ ఇస్తున్నపుడు అందరూ అన్నీ పరిశీలించడం సాధ్యం కాదు కదా! ఎన్ టీవీ, ఈ టీవీ, ఎబిఎన్, టీవీ-5.. ఇలా దాదాపు అన్నీ జాగ్రత్త పడుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే ఒకవైపు సానుభూతీ, మరోవైపు జుగుప్స కలుగుతోంది.
ఆధారాలు లేకుండా అవాస్తవాలు మీదేసుకుని చానల్ మొహాలతో ఇల్లిల్లు చేరడమెందుకు? వీక్షకులు అన్నీ గమనిస్తుంటారు. ఎపి 24×7 యాంకర్ ఒకాయన సెలవు పెట్టి, షో లో కనపడక పోతే ఆయనను తొలగించారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇది చెప్పడం ఎందుకంటే చానల్ యాజమాన్యాలు వీక్షకుల కళ్ళు మూసి రాజకీయాల పాలు తాగాలనుకున్నా-అది సాధ్యపడదు అని వివరించడానికే!
ఇదిలా ఉండగా, తెలుగు న్యూస్ చానళ్ళ గతకాలపు తిరుగులేని నాయకుడు రవి ప్రకాష్ను చివరకు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో గత మంగళవారం పోలీసు ఎంక్వయిరీ వారికి దర్శనమిచ్చాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు రవిబాబు ఎంక్వయిరీ తర్వాత మాట్లాడుతూ, మీడియా-మాఫియా అంటూ విలువలు గురించి, పోరాటం గురించి ప్రస్తావించడం ఒక రిలీఫ్. ఆయన ఇదివరకటి తప్పిదాలతో పాటు; వీడియో ద్వారా, నేరుగా వ్రాక్కుచ్చిన సుభాషితాలు కూడా గుదిబండ అవుతాయి. కొత్త ప్రభుత్వాల రాక గురించిన వార్తల కారణంగా ఈయనగారి వార్తలు అంత ప్రాధాన్యం పొందడం లేదు. అయితే ఈ వారం మెరుగైన మీడియాకు ప్రతిరూపమైన స్వయం ప్రకాశం గారి విషయం ఏదో ఒకటి తేలుతుంది. తర్వాత గరుడపురాణం మళ్ళీ కొనసాగవచ్చు. కమెడియన్ కథనం కూడా ఏకకాలంలో వస్తే వీక్షకులకు వినోదం తగ్గుతుందని శివాజీ భావించినట్టున్నారు.
పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని తెలుగు చానళ్ళు నారాయణా, చైతన్యల సాయంతో గొప్పగా అందుకుని మనకు పంచాయి. నీట్ ఫలితాల కారణంగా ఏ చానల్ చూసినా, ఎప్పుడు చూసినా పదే పదే అవే ప్రకటనలూ.. చికాకు పెట్టే అదే గొంతు ఆడియో మరింత దారుణం. ప్రకటనలు, కాదంటే ఈ రెండు విద్యా సంస్థల ప్రకటనల వంటి వార్తలు. ఇలా పరీక్షల ఫలితాలు వచ్చినపుడు వీక్షకులకెదురయ్యే హింస అంతా ఇంతా కాదు.ఈ ఆదివారం మధ్యాహ్నం నుంచీ కూడా ఇలాంటి తంతే ఇంకొంత మరోసారి.
ప్రకటనలంటే ఇక్కడ ఒకాయన భాగవతం గురించి చెబుతుంటాడు. అది ప్రోగ్రామ్ అనిపించే ప్రకటన ఐదారు నిముషాలు. ఒకసారి కాదు పలుసార్లు-ఇది రాజ్ న్యూస్ హింస. తెలుగుదేశం నాని గారు రెండు రోజులు వార్తలలో ఉన్నారు-అలక పూనారు అనే విషయం పై. ప్రతిసారీ సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్లు ఆధారంగా వార్తలు, చర్చలు నడిచాయి.
జగన్ మోహనరెడ్డి క్యాబినెట్ అంటే టీవీ9 రెండు రోజులు ఊహాగానాల వార్తలు ఇచ్చింది. తర్వాత ఎన్టీవీ అందిపుచ్చుకుంది. అయితే అసలు రోజున ఫలానా కులం; ఫలానా కులానికి ఇది, ఇన్ని అంటూ ఒక రోజుకు మించి వార్తలూ, వాటి ఆధారంగా చర్చలూ చేయడం చూశాం. ఇంత స్థాయిలో అవసరం లేదు. మరి ఇవే చానళ్ళు కులం, మతం ఒద్దంటూ ఆదర్శాలు చెబుతూ ఉంటాయి.
టింగురంగ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, మాస్ మల్లన్న అంటూ గ్రామీణ వేషాలతో తెలంగాణ యాసలో వార్తలు ఇస్తున్నారు. ఇలాంటివి ఈటీవీ, సాక్షి, ఎబిఎన్, ఎన్టీవీ తప్ప అందరూ ప్రసారం చేస్తున్నారు. కోట్లూ, డై లు, టై లు, పాంట్లు లేకుండా చూడటం బాగుంది. వీటిలో కొంత వ్యంగ్యం, హాస్యం కలిపి ఇస్తున్నారు. బిత్తిరిసత్తి బాగా పండిస్తున్నారు. టీవీ5 ‘మాస్ మల్లన్న’ వ్యాఖ్యలలో విసురు, దురుసు బాగా ఉంటోంది. హనుమంతరావు దీక్ష చేశారనే వార్తలో ఆ స్థాయి చౌకబారు వ్యంగ్యం అవసరం లేదు.
– డా.నాగసూరి వేణుగోపాల్