(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
లోక్సభ నేడు రెండు మెడికల్ బిల్లులను ఆమోదించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ రెండు బిల్లులను చర్చ కోసం సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ ఆయుష్ శాఖ మంత్రి శ్రీపద్ నాయక్ కోవిడ్ నుండి కోలుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షణ తరువాత గతంలోనే రెండు బిల్లులకు రాజ్యసభ ఆమోదం దక్కిందని తెలిపారు మంత్రి వర్షవర్థన్. యోగా కోసం కూడా ఇదే తరహాలో బిల్లును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు.
మెడిసిన్ బిల్లుపై ఎంపి శశిథరూర్ అభ్యంతరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బిల్లులో ఎనిమిది అంశాలు ఉన్నాయనీ, స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలను బిల్లును విస్మరించినట్లు శశిథరూర్ ఆరోపించారు. యోగాను, నేచురోపతిని బిల్లును తప్పించారన్నారు. భారతీయ వైద్య విధానంలో యోగాను జోడిస్తే తప్పేమిటి, దానికి మళ్లీ ప్రత్యేకంగా బిల్లు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. వాయిస్ ఓటు ద్వారా రెండు వైద్య బిల్లులను పాస్ చేశారు. అనంతరం లోక్సభను రేపు సాయంత్రం మూడు గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.