తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్కు దూరంగా ఉండేందుకు సంకేతాలు ఇచ్చేశారు. తాజా ఎన్నికల్లో జగన్ వంశీకి గన్నవరం సీటు ఇవ్వనని దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడో రెండు నెలల క్రితమే జగన్ నుంచి వంశీకి ఈ సంకేతాలు వచ్చేసాయి. అందుకే రెండు నెలలుగా వంశీ గన్నవరం నియోజకవర్గంలో అంత యాక్టివ్గా లేని మాట వాస్తవం.
జగన్ నుంచి సీటు లేదన్న బలమైన సంకేతాలు రావడంతోనే వంశీ తనకు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని వెంటబెట్టుకుని ఒకటి రెండుసార్లు జగన్ ను కలిశారు. అయినా వంశీకి సీటి విషయంలో ఎలాంటి సానుకూలత లేదు. గన్నవరంలో వంశీ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బెజవాడ పార్లమెంటుకు లేదా మైలవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని జగన్ సూచించినట్టు ప్రచారం జరిగింది. అయితే గన్నవరం వదులుకునేందుకు వంశీకి ఎంత మాత్రం ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలో వంశీ మాట జగన్ వినే పరిస్థితి లేదు. ఇటు గన్నవరం వదులుకునేందుకు వంశీకి కూడా ఇష్టం లేదు. పోటీ చేస్తే తాను గన్నవరంలోనే పోటీ చేస్తానని తన అనుచరులతో చెప్పేస్తున్నారు. అంటే జగన్ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని చెపుతున్నట్టుగా ఉంది. అటు సింహాద్రి రమేష్ ను జగన్ అవనిగడ్డ అసెంబ్లీ నుంచి తప్పించి బందరు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు. అయితే రమేష్ కు బందరు పార్లమెంటుకు పోటీ చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు. తాను అవనిగడ్డలోనే పోటీ చేస్తానని చెబుతున్నారు.
అందుకే పామర్రు లో జరిగిన జగన్ సభకు వంశీతో పాటు సింహాద్రి రమేష్ కూడా డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చాక వైసీపీతో అంట కాగుతూ టిడిపి అధినేత చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేష్ తో పాటు చివరకు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా మారింది. తనకు వైసీపీలో రెడ్ కార్పెట్ వేస్తారని వంశీ భావిస్తే ఇలా అవుతుందని ఎంత మాత్రం ఊహించి ఉండడు.