Vangaveeti Radha Krishna: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. అయితే దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ ఏ పార్టీ నుండి.. ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనేది చాలా రోజుల నుండి చర్చనీయాంశం ఉంది. వంగవీటి రాధా కృష్ణ గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కానీ ఎక్కడ నుండి పోటీ చేయలేదు. నాడు టీడీపీ మచిలీపట్నం లోక్ సభ స్థానం పోటీ చేయాలని సూచించినప్పటికీ తాను కోరుకున్న విజయవాడ సెంట్రల్ అవకాశం లేకపోవడంతో పోటీ చేయకుండానే టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు.
టీడీపీలో కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా యాక్టివ్ గా లేరు. దివంగత వంగవీటి రంగాకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో అభిమానులు, నేతలు ఉండటంతో వారు ఏర్పాటు చేసిన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొంటూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం రెండు మూడు పర్యాయాలు వంగవీటి రాధాను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు జరిపారు. కానీ వైసీపీలోకి వెళ్లేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. గత ఏడాది డిసెంబర్ చివరలో వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి రాధాతో భేటీ కావడం నాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతకు కొద్ది రోజుల ముందు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోనూ రాధా భేటీ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అలానే రాధా సన్నిహిత మిత్రులైన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను వైసీపీలోకి అహ్వానించారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వంగవీటి రాధా మాత్రం తన రాజకీయ ప్రయాణంపై ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికారు చేశారు. అయితే కొద్ది రోజులుగా జనసేన పార్టీలో చేరి ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారంటూ వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా తాజా రాజకీయ పరిణామాలు కనబడుతున్నాయి.
మంగళవారం గుంటూరులో జనసేన నేత, ఎంపీ వల్లభనేని బాలశౌరితో వంగవీటి రాధా సమావేశమైయ్యారు. దాదాపు గంట పాటు వీరి భేటీ జరిగింది. అంతే కాకుండా సోమవారం రాత్రి తెనాలిలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోనూ రాధా భేటీ అయ్యారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. తనకు టీడీపీ నుండి సీటు దక్కకపోవడంతో .. జనసేనలో చేరి, ఆవనిగడ్డ నుండి పోటీ చేయాలని రాధా ప్రణాళికలు రచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి వల్లభనేని బాలశౌరి జనసేన అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. దీనికి తోడు పొత్తులో భాగంగా ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ జనసేనకు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాధా జనసేన నేతలతో వరుస భేటీలు జరుపుతుండటం రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Janasena: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన పవన్ కళ్యాణ్