ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్ పీ ) విచారణ కొనసాగుతోంది. హైకోర్టు అదేశాల్లో పలు అంశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా అన్నదానిపై సుప్రీం కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉండగా, వైసీపీ పెద్దలు మాత్రం.. తమ పార్టీ, ప్రభుత్వ నిర్ణయం పరిపాలనా వికేంద్రీకరణేనని స్పష్టం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపై కృతనిశ్చయంతో ఉంది.
తాజాగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ఏర్పాటునకు మూహూర్తం ఖరారు అయినట్లుగా ఆయన మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరో రెండు నెలల్లో విశాఖ ఏపికి పరిపాలనా రాజధాని కాబోతున్నదని స్పష్టం చేశారు. గతంలో సీఆర్డీఏ రద్దు చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ చట్టం రద్దు చేసిన సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి మాసంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి బిల్లులను తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
శాసనసభ, శాసన మండలిలో బిల్లుల ఆమోదం పొందిన వెంటనే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు ప్రక్రియను ప్రారంబించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉండటం వల్లనే మంత్రి గుడివాడ అమరనాథ్ రెండు నెలల్లో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతుందని ప్రకటించారని అనుకుంటున్నారు. అయితే సుప్రీం కోర్టులో రాజధానికి సంబందించి పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, తీర్పు వెలువడకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
ఒక వేళ కోర్టు తీర్పు ఆలస్యం అయితే గతంలో తమిళనాడులో సీఎం జయలలిత హయాంలో పరిపాలన సాగించిన విధంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు నెలల్లో తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుండే పరిపాలన సాగించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టుకుని అయినా పరిపాలనా సాగించే అవకాశం ఉంటుంది. దీనికి న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురు అయ్యే అవకాశం ఉండదు. ముందుగా సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖలో ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు పరిపాలనా రాజధాని విశాఖ అవుతుందన్న భరోసా ఇచ్చిన్నట్లు కూడా అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ మదిలో ఏమి ఉన్నదో.. ? ఏమి జరుగుతుందో చూడాలి మరి..!
జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. వారి పదవీ కాలం పొడిగింపు