ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన వికేంద్రీకరణకు అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన ప్రయోజనంగా చూపుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఈరోజు కాన్సెప్ట్ సిటీలను ప్రకటించింది. ఈరోజు సచివాలయంలో జరిగిన సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు కాన్సెప్ట్ సిటీలను ఎంపిక చేసారు.
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలను కాన్సెప్ట్ సిటీలుగా ఎంపిక చేసిన జగన్, ఈ ప్రాంతాలలో అభివృద్ధి వేగంగా చేయాలనీ సూచించారు. ఈ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో సిటీ 10 చదరపు కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా చూస్తున్నామని జగన్ అన్నారు. భూమి, నీరు, విద్యుత్ ప్రోత్సాహక ధరలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు.