వడ్లు పండించినోడు రైతు..! వడ్లు ఆడి, బియ్యం చేసినోడు మిల్లర్..! దుకాణంలో కూర్చుని అమ్మినోడు వ్యాపారి..! డబ్బు పెట్టి కొనుక్కునేవాడు వినియోగదారుడు..!! ఇక్కడ కష్టం రైతుది..! శ్రమ దోపిడీ తర్వాత వాళ్ళది..! మరి వ్యవసాయం విలువ తెలియాలంటే రైతు బతుకు చూపించాలా..? మిల్లర్ ని చూపించాలా..? వ్యాపారిని చూపించాలా..? కానీ చంద్రబాబు ఏం చేశారు..?? రైతుని మొదట చూపించకుండా.., మొదట వ్యాపారిని, తర్వాత మిల్లర్ ని, తర్వాత రైతుని చూపించారు. అందుకే లోకేష్ ఇలా…!!
సరే అర్ధం కాకపోతే అది వదిలేద్దాం..!!
చేప పెంచి, వల వేసి పట్టినోడు జాలరి..! దాన్ని హోల్ సేల్ గా మార్కెట్ కి పంపేవాడు దళారి..! మార్కెట్ లో కూర్చుని అమ్మేవాడు వ్యాపారి..!! ఇక్కడ కష్టం ఎవరిదీ..? జాలరిది..! చేప గురించి చెప్పాలంటే ఎవరిని చూపించాలి..? జాలరినా..? దళారినా..? వ్యాపారినా..!? కానీ చంద్రబాబు ఏం చేసాడు..!? జాలరి బతుకు తెలియాలంటే ముందుగా అతని నుండి మొదలు పెట్టాలి..! కానీ మొదట మార్కెట్ లో వ్యాపారిని, తర్వాత దళారిని, తర్వాత జాలారిని చూపించారు..! అందుకే లోకేష్ ఇలా..!!
సరే.. అర్ధం కాలేదా..? ఇప్పుడు సూటిగా పాయింట్ కి వచ్చేద్దాం..!!
రాజకీయం తెలియాలంటే.., జనాల్ని ఏలాలంటే.., నేరుగా కుర్చీ ఎక్కితే పైన చెప్పుకున్నట్టు వ్యాపారం, దళారి తత్వం మాత్రమే అలవడుతుంది. అంటే పైన కూర్చుని కిందకు చూస్తే తన ఎత్తు విలువ తెలియదు, ఎక్కే కష్టం తెలియదు..!! అందుకే కింద కూర్చుని పైకి చూడాలి.. అప్పుడే ఆమ్మో అంత ఎత్తుకి ఎక్కాలా..? చాలా కష్టపడాలి అనే ప్రాధమిక సూత్రం అలవడుతుంది..!! తన కుమారుడు విషయంలో చంద్రబాబు చేసిన పొరపాటు ఇదే..!!
‘ఏమయ్యా..!? లోకేశా ఈ లోతు చాలదోయ్..! పీకల్లోతు దిగాల్సిందే..! దిగు వస్తే రా.., వీరుడిగా ఉంటావ్, లేకపోతే లేదు. ఇంటికెళ్లి పాలయాపారం చేసుకుంటావ్..! ఇలా నడుం లోతు, ప్యాంట్లు తడుపుకుంటే ఏ మాత్రం చాలదు..! ఇప్పుడున్న రాజకీయానికి, నీ ప్రత్యర్థి ఉన్న స్పీడ్ కి నీ దిగుడుగుణం ఏ మాత్రం చాలదు గాక ,చాలదు..!!
కేటీఆర్ చుడండి..!! తెలంగాణ ఉద్యమం చేశారు. ఎమ్మెల్యే అయ్యారు, మాటలు చెప్పారు. జనంలో నిలబడ్డారు, పోరాటాలు అలవాటు చేసుకున్నారు. ఓ స్థాయిలో వెలుగొందుతున్నారు..!
జగన్ చుడండి తండ్రిని కోల్పోయిన తర్వాత రాటు దేలారు. కాంగ్రెస్ ని ఢీ కొట్టారు. జైలుకి వెళ్లారు. ప్రతిపక్షంలో నిలబడ్డారు. చావో, రేవో తేల్చుకోవాల్సిన దశలో గెలిచారు, నిలబడ్డారు..!!
నాయకత్వానికి షార్ట్ కట్ లు ఉండవు. జనమే బలం, బలగం..! జనం నుండి వస్తేనే, జనం గెలిపిస్తేనే అది శాశ్వతం.., జనంతో సంబంధం లేకుండా వచ్చేస్తే అది అశాశ్వతం..! అందుకే నారా లోకేష్ కి ఇలా..! ఒక సీఎం కొడుకుగా షార్ట్ కట్ లో ఎమ్మెల్సీ.., మంత్రి అయిపోవడం.., తొలి ఎన్నికల్లోనే ఓడిపోవడం.., ఇప్పుడు నేలకు దిగి రాజకీయం కొత్తగా మొదలు పెట్టడం..!! అందుకే ఎన్ని జిల్లాలు తిరిగినా..? ఎన్ని మోకాల్లోతు నీళ్లలో దిగినా..? లోతు తెలియాదు లోకేశా..?? పీకల్లోతులో దిగు. వస్తే ఉంటావు, లేకపోతే పాల యాపారం చేసుకో..!!