వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకే పరిమితం అయిందా?ఎందుకు తెలంగాణ వైపు ఆ పార్టీ దృష్టి సారించడం లేదు?వంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.2014 ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం దక్కాయి.
అయితే ఆ తర్వాత అ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరిపోయి తమ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేశామని చెప్పుకోగా అప్పటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడం దానిపై వైసిపి మండిపడడం జరిగింది అంతటితో ఆ ఎపిసోడ్ ముగిసింది.ఆ తర్వాత కొద్ది కాలానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఇకపోతే 2016 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసిపి పోటీకి నిలబడలేదు.వచ్చే నెలలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు వైసీపీ తాజాగా ప్రకటించింది. దీని పైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తెలంగాణలో ఆ మాటకొస్తే హైద్రాబాద్లో ఏమాత్రం బేస్ లేని జనసేన సైతం అక్కడ పోటీకి సిద్ధపడుతుండగా వైసిపి అందుకు వెనకాడ్డం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
హైదరాబాద్లో ఆంధ్రా ప్రాంత ప్రజలు సెటిలర్స్గా ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి.వారిలో చాలామందికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పై అభిమానం కూడా ఉంది.రెండు టెర్ములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటివల్ల హైదరాబాదులోని ఆంధ్రా సెటిలర్స్ బాగా లబ్ధి పొందారు.ఈ పరిస్థితుల్లో వైసిపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం పదిహేను నుంచి ఇరవై డివిజన్లు లభించవచ్చునని అంచనా ఉంది. వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకని ఎన్నికలకు దూరంగా ఉన్నారన్నది అర్థం కాని విషయం అంటున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోసం జగన్ ఈ త్యాగం చేశారా అంటే ఈ మధ్య కాలంలో జలవివాదాల కారణంగా జగన్ కి కెసిఆర్ కి మధ్య కాస్త సంబంధాలు బెడిశాయి.
ఈ నేపధ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి పోటీకి దిగి కేసీఆర్ కి ఝలక్ ఇచ్చి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.ఇక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ వ్యూహం ప్రకారం టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు వైసిపిని నిలువరించిందా అన్నది మరో పాయింట్.వైసిపి కూడా బీజేపీతో చెలిమి చేస్తున్నందున వారికి ఇబ్బంది కలుగకుండా గౌరవ ప్రదంగా తనే బరి నుండి తప్పుకుందంటున్నారు.ఏదేమైనా పార్టీ అన్నాక ఎదగాలి. మజ్లిస్ పార్టీ మొన్నటిదాకా హైద్రాబాద్ కి పరిమితమైన పార్టీ .ఇప్పుడు మహారాష్ట్ర బీహార్ లకు కూడా వ్యాపించింది .రేపు ఆంధ్రప్రదేశ్ కి కూడా రానున్నదట.అలాంటిది తెలంగాణాలో హైద్రాబాదులో ఓటు బ్యాంకు ఉన్న వైసిపి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైపోవడం ఆ పార్టీ వారికే నచ్చడం లేదు.