‘పార్టీ కోసం కష్టపడడుతున్న వారిని కాకుండా.. మధ్యలో వచ్చిన వారిని అందలం ఎక్కిస్తారు..’ అని టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యర్ధులు తరచూ చెప్తుంటారు. ఇది నిజమని చాలాసార్లు రుజువైంది కూడా. చంద్రబాబు నిర్ణయాలతో పార్టీలో వ్యతిరేకత వచ్చినా, నాయకులు కామెంట్లు చేసినా.. వారిని కూల్ చేయడంలో బాబు సిద్ధహస్తులు. 2017లో ఏం జరిగిందో తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా అదే చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పార్టీల దృష్టి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై ఉంది. టీడీపీ కూడా ఇందుకు సిద్ధమై తమ అభ్యర్ధిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. అయితే.. ఈ నిర్ణయం పట్ల పార్టీలో వ్యతిరేకత ఉందనీ.. పనబాక లక్మిలో అంత సానుకూలత లేదని అంటున్నారు.
పనబాక మళ్లీ పోటీ చేయడం వారికి ఇష్టం లేదా..
2019 ఎన్నికల సమయంలో పనబాక లక్ష్మీ టీడీపీలో చేరారు. అప్పటికప్పుడు ఆమెను తిరుపతి ఎంపీ అభ్యర్దిగా బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ రావు చేతిలో ఓడిపోయారు. ఆయన మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. మళ్లీ పనబాక లక్ష్మినే అభ్యర్ధిగా ప్రకటించింది టీడీపీ. అయితే.. ఈ నిర్ణయంపై టీడీపీ చిత్తూరు క్యాడర్ అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. 2019లో ఓడిన తర్వాత పనబాక కూడా టీడీపీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనలేదు. ఇప్పుడు అభ్యర్ధిగా ప్రకటించినా ఇప్పటికీ ఒక్క ప్రకటనా చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఆమెకు స్థానిక నాయకత్వం నుంచి సహకారం అసాధ్యమే. పైగా సానుభూతి ఓట్లు, వైసీపీ హవా పరంగా కూడా టీడీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ.
చంద్రబాబు ఆలోచన అదేనా..
ఓడిపోయిన చోటే మళ్లీ అభ్యర్ధిత్వానికి ఆమెకు ఇష్టం లేదని అందుకే ఎటువంటి ప్రకటనా చేయలేదని అంటున్నారు. అయితే.. బాబు మాటను దాటలేక పోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అదీ కాకుండా మళ్లీ ఓటమి తప్పదేమో అనే భావన ఒకటైతే.. యాక్టివ్ గా ఉంటే మళ్లీ ఖర్చు పెట్టాలనే ఉద్దేశం కూడా ఒక కారణమని అంటున్నారు. చంద్రబాబు ఈ ఎన్నికపై దృష్టి పెట్టినా.. మళ్లీ కొత్త అభ్యర్ధి కోసం కసరత్తు చేయడం కంటే.. పనబాకే బెటర్ అని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.