Chandrababu Naidu : జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని.. పార్టీ తరఫున ప్రచారం చేయాలనే డిమాండ్ తిరిగి తెరపైకి తెచ్చారు తెలుగు తమ్ముళ్లు. కుప్పం కంచుకోటలోనే అధినేత ఎదుట జూనియర్ రావాలంటూ చేసినా నినాదాలు హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ లేవాలంటే జూనియర్ రావాల్సిందేనా? పార్టీ ప్రచారానికి ఎన్టీఆర్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
నేపథ్యం ఏమిటంటే?
ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పల్లెపోరులో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నప్పటికీ.. టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న వాదన పార్టీలో ఒక వర్గం ముందుకు తెస్తోంది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలే నిదర్శనం. కుప్పం అసెంబ్లీ పరిధిలో మెజార్టీ పంచాయతీలను కైవశం చేసుకున్న వైసీపీ.. చంద్రబాబుకు షాకిచ్చింది. దీంతో ఫలితాలు వచ్చిన వారంలోపే కుప్పం వచ్చిన టీడీపీ అధినేత మూడు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబుకు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఊహించని అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రచారానికి రావాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతీ ఫ్లెక్సీలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనిపించాయి. గతంలో ఇంత ప్రముఖంగా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను ఫ్లెక్సీలపై, బ్యానర్లపై టీడీపీ శ్రేణులు వినియోగించిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం.. చంద్రబాబు, లోకేష్, బాలయ్య ఫొటోలతో పాటు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను ఏర్పాటు చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.
Chandrababu Naidu : ఎక్కడా కమిట్ గాని చంద్రబాబు!
అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జూనియర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. జూనియర్ వస్తారని కానీ.. రారని కాని సంకేతాలివ్వడం లేదు. కుప్పం పర్యటనలో మాత్రం జూనియర్ సేవలను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉందన్నట్టుగా చంద్రబాబు హావభావాలు స్పష్టం చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భంలో.. ఆ నినాదాలు చంద్రబాబు చెవిన పడినప్పటికీ తలూపారే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇదే టూర్ను ముగిస్తున్న సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జూనియర్ రీఎంట్రీ ఇప్పట్లో ఉండదని స్పష్టం చేశాయి. అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తానని, లోకేష్ కూడా వస్తారని చెప్పిన చంద్రబాబు ఎన్టీఆర్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. టీడీపీ వారసత్వం ప్రస్తుతానికి లోకేష్దేనన్న స్పష్టతను కుప్పం సాక్షిగా చంద్రబాబు పార్టీ శ్రేణుల్లోకి పంపడం విశేషం. దీన్ని టిడిపి క్యాడర్ ఎంతవరకు ఆమోదిస్తుంది అన్నది చూడాలి!