కడప, ఫిబ్రవరి 7: ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా తాను ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ సమయంలో వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమర శంఖారావంలో భాగంగా గురువారం కడప జిల్లాలో మొదట తటస్థులతో సమావేశం నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారి నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. అనంతరం బూత్ కమిటి కన్వీనర్లు, సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
వైసిపి ఆధికారంలోకి రాగనే ఫించన్ సొమ్ము మూడు వేల చొప్పున చెల్లిస్తాం, పొదుపు మహిళల అప్పు నాలుగు వాయిదాల్లో చెల్లించే ఏర్పాట్లు చేస్తాం, అందరికి ఉచిత వైద్య సేవలు అందిస్తాం, కేజీ నుండి పీజి వరకూ ఉచిత విద్య అందిస్తాం. ఇలా మనం చేయబోయే పథకాలు అన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ అన్నారు.
దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు అన్న నమ్మకం ఉంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల్లో కార్యకర్తలు అంటారు, కానీ వైసిపిలో మిమ్మల్ని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా గుర్తించామని జగన్ అన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే అందరినీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకువస్తానని జగన్ హామీ ఇచ్చారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో నిమిత్తం లేకుండా సంక్షేమ పథకాలను తన ప్రభుత్వంలో అందిస్తానని జగన్ అన్నారు.