YS Jagan: ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎంప్లాయిస్ వార్ గా సాగిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. మెరుగైన పిఆర్సి సాధనే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టిన ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. ఉద్యోగుల ఆందోళనలపై తొలుత తగ్గేది లే అన్నట్లుగా వ్యవహరించిన ప్రభుత్వం… పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ సక్సెస్ కావడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెలోకి వెళ్లకుండా చూడాలని, అవసరమైతే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో సవరణలు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రుల కమిటీకి ఆదేశించారు. దీంతో మంత్రుల కమిటీ శుక్రవారం రాత్రి సుమారు 6 గంటలు గంటలు, శనివారం మరో ఏడు గంటలు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.
YS Jagan : ఫిట్ మెంట్ లో మార్పు మినహా
పీఆర్సీ మినహా ఇతర అంశాల్లో సవరణలకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో నూతన పీిఆర్సీ జీవో వెనక్కు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ను ఉద్యోగ సంఘాలు పక్కన పెట్టాయి. చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. ఉద్యోగుల ఉద్యమం టీ కప్పులో తుఫాను అయ్యింది. ప్రభుత్వాన్ని విమర్శించిన ఉద్యోగ సంఘాల నేతలే చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిచండంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు పలువురు ఉద్యోగులు ఆవేశంతో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీకి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు వ్యతిరేకంగా మారిపోయారు అనుకున్న ప్రతిపక్షాల నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యింది.
YS Jagan : వైసీపీ వర్గాల్లో హర్షం
ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో కొన్ని రోజులుగా వైసీపీ వ్యతిరేక మీడియాలో ఉద్యోగుల ఆందోళనను హైలెట్ చేస్తూ వార్తలు ఇవ్వగా, ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రభుత్వం పట్ల ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ వార్తలు వచ్చాయి. ఎలాగోలా ఉద్యోగుల సమస్య పరిష్కారం కావడంతో వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విమర్శించిన నోళ్లతోనే సీఎం జగన్ ప్రశంసలు పొందుతున్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముందుగానే ఊహించిందే. అందుకే ఉద్యోగుల ఆందోళనకు ప్రత్యక్షంగా మద్దతు పలకలేదు.
ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందాలు ఏమిటంటే..
- పిఆర్సీ స్లాబుల్లో సవరణలకు అంగీకారం
- హెచ్ఆర్ఏలో నాలుగు స్లాబ్ లకు అంగీకారం
- ప్రకటించిన 23 శాతం ఫిట్ మెంట్ కొనసాగింపు
- అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో మార్పులు
- ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక అందజేయడం
- వేతన సవరణ పరిమితి అయిదేళ్లే
- కేంద్ర పీఆర్సీని భవిష్యత్తులో అమలు చేయరు.
- రాష్ట్ర పిఆర్సీనే కొనసాగింపు
- అంత్యక్రియల ఖర్చు రూ.25వేలు
- గ్రామ సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ కాగానే కొత్త పేస్కేల్ అమలు
- సీపీఎస్ ను పరిశీలనకు కమిటీ ఏర్పాటు
- కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కమిటీ ఏర్పాటు
- తదితర అంశాల ఒప్పందంపై స్టీరింగ్ కమిటీ నేతలు సంతకాలు చేశారు.