YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సిద్దం’ పేరుతో పార్టీ క్యాడర్ తో వైసీపీ నేటి నుండి సమావేశాలు నిర్వహిస్తొంది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తొంది. ఈ సమావేశానికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హజరై 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఏర్పాటు చేసిన భారీ ప్రాంగణంలో తొలి సభ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం జగన్ ..అక్కడి నుండి హెలికాఫ్టర్ లో భీమిలి సంగీవలసలో జరిగే బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. ఈ సభలో రాబోయే ఎన్నికలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా భారీ ఎత్తున క్యాడర్ తో సమావేశం నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఎలా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించడం, పార్టీ మరింత బలోపేతం చేయడం కోసం క్యాడర్ ఏ విధంగా కృషి చేయాలని తదితర అంశాలపై జగన్ పలు సూచనలు చేయనున్నారు.
అలానే పార్టీ క్యాడర్ తో మమేకమై తానున్నానంటూ వారికి భరోసా ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్ర తర్వాత రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాల్లో క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించే దిశగా క్యాడర్ ను సిద్దం చేయనున్నారు. ఇదే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా జగన్ క్యాడర్ కు వివరించి, పార్టీ అభ్యర్ధి విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించనున్నారు.
గెలుపే లక్ష్యంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చి కొత్త వారికి ఇన్ చార్జి గా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు జరగనున్నాయి. నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరైనా పార్టీని దృష్టిలో పెట్టుకుని క్యాడర్ పని చేయాలని సీఎం జగన్ సూచించనున్నారు. ఈ ఎన్నికల శంఖారావం పూరిస్తున్న ఈ సభలోనే కీలక హామీలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో పాటు మరల అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కొత్త పథకాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Kovvuru TDP: కొవ్వూరు టీడీపీలో చిచ్చురేపిన ఫ్లెక్సీల వ్యవహారం