పరిపాలన మీదే దృష్టి పెట్టాలా.. ప్రతిపక్షాలనే ఎదుర్కోవాలా.. సొంత పంచాయతీలే చేయాలా.. ప్రస్తుతం జగన్ ఈ విషయాలలో మూడో విషయంతో ఎక్కువ ఇబ్బందిపడుతున్నారంట. పరిపాలనా… ఉన్నంతలో బాగానే చేసుకుంటూ పోతున్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే విషయాలా… దానికి ఏస్థాయి మాటలకు ఆ స్థాయిలో డోస్ లు పెంచే టీం.. అసెంబ్లీ లోపలా, బయటా రెడీ గా ఉంది. ఇక వీటన్నింటికీ మించి సొంతపార్టీ నేతలతోనే జగన్ కు పెద్ద చిక్కులు వచ్చి పడుతున్నాయట.
ఇప్పటికే పదవులు లేని కొందరు నేతలు, జగన్ తో పూర్తిస్థాయి యాక్సస్ లేని ఇంకొందరు నేతలు ఇసుక పేరుచెప్పి మైకులముందుకు వచ్చి బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో… పదవులు పొంది, జగన్ తో మంచి యాక్సస్ ఉన్న నేతలేమో పంతాలకూ, పట్టింపులకూ పోయి కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నారంట. ఇలాంటి ఒక జోడీ విషయం జగన్ వరకూ చేరడంతో… జగన్ కాస్త సీరియస్ గానే స్పందించారని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే… విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పార్టీ అభివృద్ధి కంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రతిష్టలు, పనికిమాలిన ఈగోలకే ప్రాధన్యత ఇస్తున్నారట. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏదైనా సిఫారసు చేస్తే.. మంత్రిగా ఉన్న వెల్లంపల్లి పట్టించుకోవడం లేదనేది శ్రీనివాస్ పై ఆరోపణ అయితే… తాను చెప్పింది వినాలని, తనది కూడా సహ కేబినెట్ హోదా (ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్) అని విష్ణు పట్టుబడుతున్నారట. దీంతో వ్యవహారం చినికి చినికి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టుల పెట్టుకునే వరకూ వెళ్లిందట.
దానికి కారణం… ఇటీవల పార్టీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇద్దరు నేతలూ సిద్ధమయ్యారట. ఈ క్రమంలో ఎవరిస్థాయిలో వారు కార్యక్రమాలు చేసుకున్న అనంతరం… సెంట్రల్ కార్యక్రమాలు సరిగా నిర్వహించలేదని వెలంపల్లి శ్రీనివాస్ వర్గం విష్ణు బ్యాచ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఇదే సమయంలో పశ్చిమలో పార్టీ కార్యక్రమాలు సరిగా నిర్వహించలేదని విష్ణు వర్గం వెల్లంపల్లి బ్యాచ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగిందట. దీంతో ఇరు వర్గాల మధ్య ఆన్ లైన్ వేదికగా ఘర్షణ వాతావరణం వేడెక్కిందట!
సరే, ప్రతీ చిన్న విషయం జగన్ వరకూ తీసుకెళ్లడం ఎందుకులే అనుకున్న కొందరు నేతలు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా… పదవులతో వచ్చిన పొగరో లేక తగ్గింపు గుణం లేని ప్రవర్తనవల్లో కానీ… వీరిరువురూ ఏమాత్రం తగ్గడం లేదంట. ఈ పరిణామాలను గమనించిన మంత్రులు.. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారంట. దీంతో బయట ఉన్న తలపోట్లు చాలవన్నట్లు పార్టీ లోపల కూడా ఇలాంటి తలపోట్లు తీసుకురావడం ఏమిటి అని సీరియస్ అయ్యి.. ఇద్దరినీ సైలెంట్ అవ్వాలనే ఆదేశించారంట జగన్! ఆ సంగతులు అలా ఉంటే… దేవాలయ భూముల విషయంలో కన్నా లక్ష్మీనారయణను విమర్శించే విషయంలో వీరి హడావిడి చూసి పార్టీపై ప్రేమ అనుకున్నవారంతా… ఇప్పుడు అదికూడా ఆధిపత్యదోరణిలో భాగమేనా అని అనుకుంటుండటం కొసమెరుపు.