2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొద్దిగా ఊరట నిచ్చిన జిల్లా ఏదైనా ఉంటే అది విశాఖపట్నం మాత్రమే.ఆ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుని టిడిపి పరువు నిలబెట్టుకుంది.ఇప్పుడు ఆ జిల్లాపై కూడా వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ కన్ను పడినట్లు కనిపిస్తోంది.
రాజధానిని విశాఖపట్నంకు మార్చేస్తామని ఎప్పుడైతే వైసిపి ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రాంత టిడిపి నేతలు కూడా సీలింగ్ ఫ్యాను కింద సేద తీరాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.గంటా వ్యవహారశైలి పరిశీలిస్తే ఆయన పార్టీలు ఫిరాయించడం లో నిపుణుడు.ఎప్పుడైనా గంటా గోడ దూకవచ్చునని టిడిపి వర్గాలే భావిస్తున్నాయి.మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో యాక్టివ్గా లేరు.అయితే మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు బండారు సత్యన్నారాయణ మూర్తి వంటి వారు మాత్రం టిడిపి పక్షాన గట్టిగానే నిలబడుతున్నారు.కానీ చంద్రబాబు విశాఖపట్నం జిల్లాలోని ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా అన్నదే అనుమానం.
ఇప్పటికే టిడిపి సీనియర్ నేతలు పంచకర్ల రమేష్ బాబు అడారి ఆనంద్ తదితరులు వైసీపీకి లో కొచ్చేశారు.అరకు నుంచి పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్ అడ్రస్ లేరు.విశాఖపట్నంలో ఓటమిపాలైన నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.విశాఖపట్నం కనుక రాజధాని అయితే టిడిపిలో ఉండి తాము చేసేదేమీ ఉండదని వైసీపీ కి రావటం మంచిదని పలువురు టిడిపి నేతలు తమ సన్నిహితులకు చెప్పుకుంటున్న విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన ఎలా ఈ పరిస్థితిని అధిగమించాలా అని తల పట్టు కూర్చున్నట్లు టిడిపి వర్గాలే చెపుతున్నాయి.మరి జగన్ దెబ్బా? మజాకా?